టీ 20 మ్యాచ్ ల్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్ గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఇంతవరకు టీ 20ల్లో ఉండి లేనట్టుగా ఉన్న రుతురాజ్ ఇంత గొప్ప రికార్డ్ సాధించాడనే సరికి అభిమానులు ఆశ్చర్యచకితులు అవుతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే 116 ఇన్నింగ్స్ లో 4వేల పరుగులు చేసిన భారత క్రికెటర్ గా రుతురాజ్ అరుదైన ఘనత సాధించాడు. రాయ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ 20 లో 7 పరుగులు చేసిన రుతురాజ్ 4వేల క్లబ్ లో చేరాడు. తర్వాత 32 పరుగులు చేసి తను అవుట్ అయ్యాడు.
ఇంతకుముందు ఈ రికార్డ్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరున ఉండేది. అతను 117 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయిని అధిగమించాడు. అయితే రుతురాజ్ ఒక్క మ్యాచ్ ముందే ఆ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రం 4000 పరుగులని 109 మ్యాచ్ ల్లో 107 ఇన్నింగ్స్ లో పూర్తి చేశాడు. 2012లో ఈ రికార్డ్ సృష్టించాడు.
11 ఏళ్లు అయినా అదింతవరకు బ్రేక్ కాలేదు. ప్రస్తుతం బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకుంటున్న టీమ్ ఇండియా టీ 20 ప్లేయర్ రింకూ సింగ్ ఏమైనా ఛేదిస్తాడేమో చూడాలని అభిమానులు అంటున్నారు.
తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో రుత్ రాజ్ గైక్వాడ్ 57 బాల్స్ లో 13 ఫోర్లు, 7 సిక్స్ లతో 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టీ 20 మ్యాచ్ ల్లో రుతురాజ్ 5 సెంచరీలు చేశాడు.
రుతురాజ్ జులై 2021లో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. అతని కెరీర్ టీ20 మ్యాచ్లతో ప్రారంభమైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో ఈ మ్యాచ్ జరిగింది. తదనంతరం రెండున్నరేళ్లు అంతర్జాతీయ కెరీర్ ఒడిదుడుకులతోనే సాగింది. అంతేకాదు కేవలం టీ20 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. గాయాల కారణంగా, ఒకొక్కసారి పేలవమైన ఫామ్ తో జట్టులోపల, బయట అన్నట్టే కొనసాగుతున్నాడు.
కానీ ఈసారి మాత్రం బ్రహ్మాండమైన రికార్డ్ బ్రేక్ చేసి చరిత్ర స్రష్టించాడు. దీంతో రుతురాజ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోతోంది. ఇన్నాళ్లూ అండర్ డాగ్ లా ఉన్న రుతురాజ్ ఒక్కసారి ఈ రికార్డ్ తో లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఇక నుంచి మంచి భవిష్యత్తున్న క్రికెటర్ గా పేరు తెచ్చుకుంటాడు.