Rohit Sharma : ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించిందో అప్పటి నుంచి రకరకాల కథనాలు నెట్టింట కోడై కూస్తున్నాయి. రోహిత్ శర్మని తప్పించడానికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ సహేతుకమైన కారణాలేవీ చెప్పడం లేదు.
కాకపోతే 2024 జూన్ లో జరిగే టీ 20 వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మ 37వ వడిలో పడతాడు. ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయ ఆటగాళ్ల వయసు రీత్యా చూస్తే తను ఎక్కువ కాలం ఆడినట్టే లెక్క. ఆ ప్రకారమే తనని తప్పించారని కూడా అంటున్నారు. చాలామంది సీనియర్ ప్లేయర్లు కూడా 37 ఏళ్లు నుంచి మొదలుపెట్టి 39 కి ముగించారు.
క్రికెట్ దేవుడిగా భారతీయులు కొలిచే సచిన్ టెండుల్కర్ 39 ఏళ్లకి రిటైర్ అయ్యాడు. సెహ్వాగ్ 37 ఏళ్లకు, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 39 ఏళ్లకు, సౌరభ్ గంగూలీ 36 ఏళ్లకు, మహేంద్ర సింగ్ ధోనీ 38 ఏళ్లకు ఇలా భారత క్రికెట్ లో ఒక వెలుగు వెలిగిన గొప్ప గొప్ప క్రికెటర్లందరూ కూడా 37 ఏళ్లు దాటిన నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
ఈ లెక్కన చూస్తే రోహిత్ శర్మ టైమ్ దగ్గర పడిందనే అనుకోవాలి. మహా అయితే మరో రెండేళ్లు అంతే అంటున్నారు. నిజానికి గడిచిన మూడేళ్ల నుంచి ముంబై ఇండియన్స్ కి కప్ దక్కడం లేదు. 2021, 2022 అయితే లీగ్ దశను కూడా దాటలేదు. 2023లో బాగానే ఆడినా క్వాలిఫయింగ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏమన్నా అసంత్రప్తిగా ఉందా? అనేది తెలీదు.
వన్డే వరల్డ్ కప్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పుడెవరూ రోహిత్ శర్మని కామెంట్ చేసే సాహసం కూడా చేసేవారు కాదు. కానీ ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓటమి పాలవడంతో అందరూ మూకుమ్మడి దాడి చేయడం సరికాదని అంటున్నారు. కాకపోతే భారతదేశమంతా రోహిత్ శర్మ వెంట ఉండటం ఒక గొప్ప విషయమని మాత్రం అంటున్నారు.
ఐపీఎల్ లో కెప్టెన్సీ పోవడం రోహిత్ శర్మ ఊహించని పరిణామంగానే కనిపిస్తోంది. ఇంకా ఒక సంవత్సరం ఉంచి, వచ్చే ఏడాది మెగా వేలంకి గౌరవప్రదంగా వదులుతారని అనుకున్నారు. కాకపోతే కార్పొరేట్ మేనేజ్మెంట్ లో పండిపోయిన ముకేష్ అంబానీకి ఇలాంటివి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయని అంటున్నారు. కానీ జన స్పందనతో మాత్రం దిమ్మతిరిగిందని చెబుతున్నారు.