వన్డే వరల్డ్ కప్ లో అన్నింటా విజయాలు సాధించి, సరిగ్గా ఆడాల్సిన ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలవడంతో మానసికంగా కుంగిపోయాయని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, నా జీవితంలో అదొక చీకటిరోజు అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నవంబరు 19న అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా-టీమ్ ఇండియా మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఎన్నో అంచనాలతో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను భుజాలపై మోస్తూ క్రీజులోకి వెళ్లిన టీమ్ ఇండియా…అక్కడ పరాజయం పాలైంది. ఆ ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడా మాట్లాడలేదు. ఎవరికీ కనిపించ లేదు. చివరికి ఏమయ్యాడో కూడా తెలీలేదు. కానీ సడన్ గా సౌతాఫ్రికా పర్యటనకు సమయం దగ్గర పడటంతో మళ్లీ తెరముందుకు వచ్చాడు. ఒక కెప్టెన్ గా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని భావించి, ఒక వీడియో విడుదల చేశాడు.
ఆ ఓటమి నుంచి బయటపడటం చాలా కష్టమైందని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణను వివరించాచు. ఇదే సమయంలో ప్రపంచ కప్ టోర్నీ మొత్తం భారతజట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపాడు.
ఎంతో ఉత్సాహంతో, ఎంతో టీమ్ స్పిరిట్ తో ముందుకెళ్లామని అన్నాడు. ప్రతీ ఆటలో పొరపాట్లు చేస్తుంటాం. ఇంతకుముందు వరల్డ్ కప్ లో గెలిచిన మ్యాచ్ లో కూడా చేశాం. కానీ వాటిని అధిగమించి విజయాలు సాధించాం. కానీ ఫైనల్ కి వచ్చేసరికి సరిదిద్దుకోలేని పొరపాట్లుగా మారిపోయాయి. ఇన్నికోట్ల మంది ప్రజలను నిరాశకు గురిచేశామనే బాధ, నాకు నిద్ర పట్టకుండా చేసిందని అన్నాడు. ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలీలేదని చెప్పుకొచ్చాడు.
కానీ బయటకు వచ్చినప్పుడల్లా ప్రజలు, అసలు ఫైనల్ ఓటమి గురించే పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రజలందరూ మమ్మల్ని నిందిస్తారేమో, వాళ్లకి ముఖం ఎలా చూపించాలని అనుకున్నాను. కానీ వాళ్లు ఎంతో అభిమానంతో, ఆప్యాయంగా, ప్రేమగా పలకరించడం, చాలా బాగా ఆడారు అని ఆశీర్వదించడం చూసి, నెమ్మదిగా తేరుకున్నాను. నాకు ఒకటే అనిపించింది. ప్రజల ద్రష్టిలో మనం దోషులం కాం. మనం బాగానే ఆడాం, టైమ్ కలిసి రాలేదంతే, అని సరిపెట్టుకున్నానని అన్నాడు.
ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా ఉన్న ప్రజలను మరిచిపోలేమని అన్నాడు. వారు చూపించిన మమమకారంతోనే త్వరగా కోలుకున్నానని రోహిత్ శర్మ తెలిపాడు. ఈమధ్యలో స్నేహితులు, కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా మరువలేనిదని అన్నాడు. వారు నన్ను మళ్లీ ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారని తెలిపాడు.
అన్నిరోజులు దేనికోసమైతే కష్టపడ్డామో అది దొరకనప్పుడు, దేనికోసమైతే కలలు కన్నామో అది నెరవేరనప్పుడు నిరాశ కలుగుతుంది. అసహనం కూడా వస్తుంది.. అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రపంచకప్…నా కల అని తెలిపాడు. చిన్నతనం నుంచి ఆ మ్యాచ్ లు చూస్తూ పెరిగానని అన్నాడు. కానీ ఏం జరిగినా బయటకు రావాలి. తప్పదు కదా…మళ్లీ ముందుకు సాగాలి…అదే కదా జీవితం అని అన్నాడు.
ప్రపంచకప్ గెలిచేందుకు టీమ్ మొత్తం శాయశక్తులా కృషి చేసిందని అన్నాడు, జట్టులోని ప్రతి ఒక్కరూ గొప్పగా ఆడారని, వారి ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా పైకి ఎత్తాలని మాతోపాటు వారు కూడా కోరుకున్నారు. మ్యాచ్ కోసం ఎక్కడికి వెళ్లినా మాకు మద్దతుగా నిలిచారు. స్టేడియానికి వచ్చినవారితో పాటు, ఇళ్లల్లో టీవీలు చూస్తూ కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇలాంటి ప్రేమను చూడటం చాలా గొప్పగా అనిపించింది. మరో గొప్ప బహుమతి కోసం అన్నీ మరిచిపోయి మళ్లీ కొత్తగా పని మొదలెట్టడానికి అది చాలా స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తుందని అన్నాడు.
.
.