Rohit Sharma : ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. అయితే మ్యాచ్ గురించి కాకుండా వచ్చే టీ 20 వరల్డ్ కప్ కి ఎంపికయ్యే జట్టు, అందులో సభ్యుల గురించి మాట్లాడాడు. అలా అంటూనే ఈ విషయంలో అందరినీ సంతోషంగా ఉంచలేమని అన్నాడు. ముందుగా 15మందిని జట్టులోకి ఎంపిక చేస్తాం. వారందరూ సంతోషంగా ఉంటారు. లేనివాళ్లు బాధపడతారు. అది సహజమని అన్నాడు.
తర్వాత ఆ 15మంది నుంచి ఫైనల్ గా ఆడేవాళ్లు 11 మందే ఉంటారు. వారే సంతోషంగా ఉంటారు. మిగిలిన నలుగురు రిజర్వ్ బెంచ్ కే పరిమితం అవుతారు. వాళ్లు బాధపడతారు. ఇప్పుడు వారిని సంతోషంగా ఉంచడం ఎవరి తరం కాదని అన్నాడు. జట్టులో 11 మందే ఆడాల్సి వచ్చినప్పుడు నేనుగానీ, కోచ్ గానీ ఏమీ చేయలేమని అన్నాడు. ఎవరికైనా బాధ తప్పదని, కెప్టెన్ గా నేను నేర్చుకున్న సత్యమని అన్నాడు. అయితే నేను కూడా బాధితుడినేనని అన్నాడు.చాలాకాలం టెస్ట్ జట్టులోకి ఎంపిక కాలేదని తెలిపాడు.
జట్టులో దాదాపు 8 నుంచి 10 మంది వరకైతే ఫిక్స్ అయ్యారని హింట్ ఇచ్చాడు. వారిని మార్చలేమని తెలిపాడు. అయితే వారెవరనే సంగతి తెలియజేయలేదు. ఇంక మిగిలిన ఐదుగురు ఎవరన్నది…ఇంతమందిలోంచి ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఒకొక్కసారి బాగా ఆడుతున్నా సరే, పరిస్థితులకు తగినట్టుగా ఆడేవారితో జట్టుని ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నాడు.
వెస్టిండీస్లో వికెట్ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా జట్టు కూర్పు ఉంటుంది. ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని నేను, రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నామని తెలిపాడు. మంచిగా ఆడినప్పటికీ.. కొందరు ఎంపికవుతారు. కొందరు కారు, ఈ విషయాలను ఆటగాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తామని అన్నాడు.
రోహిత్ శర్మ చెప్పిన పదిమందిలో వీరే ఉంటారని అంచనా వేస్తున్నారు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, రింకూ సింగ్, బూమ్రా .
ఈ లెక్కన చూస్తే ఇప్పుడు ఆడే అందరిలో ఒక్కరికే అవకాశం కనిపిస్తోంది. అది కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దుబె, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, రవి బిష్ణోయ్, కులదీప్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ ఇలా వీరందరూ కనిపిస్తున్నారు.