టీమ్ ఇండియా కెప్టెన్ పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు ఆఫ్గనిస్తాన్ టూర్ కి రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించింది. అంతేకాదు విరాట్ కొహ్లీను కూడా జట్టులోకి తీసుకుంది. వీరిద్దరి వ్యవహారం ఎలాగో అర్థం కాక, టీమ్ మేనేజ్ మెంట్ చాలారోజులు నిర్ణయం తీసుకోలేక పోయింది. వారంతట వారే స్వయంగా ఇక ఆడలేమని చెప్పి ఉంటే బాగుండేది. వారు ఆ మాట అనేలేదు. ఇంకా ఆడతాం అనేసరికి, సెలక్షన్ కమిటీకి సమస్య జటిలమైపోయింది.
ఎందుకంటే వీరిద్దరూ టీ 20 మ్యాచ్ లకి సెట్ కారా? అంటే అదేం లేదు. ఇద్దరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అయితే యువ క్రికెటర్లు చాలామంది క్యూ లైన్ లో ఉన్నారు. వారిలో ఒక కసి ఉంది. ఏదో నిరూపించుకోవాలనే తెగింపు ఉంది. దానిని ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. అదే వీరిద్దరి వైపు చూస్తే ఒకవేళ అవుట్ అయినా వారికి ఫరక్ లేదు.
కాకపోతే ఇద్దరిలో డెడికేషన్ ఉంది, దేశం కోసం ఆడాలనే తపన ఉంది. తమ పేరు మీద ఒక్క ఐసీసీ కప్ అయినా తీసుకురావాలనే పట్టుదల ఉంది. కానీ కొత్తవారిని చూస్తే, వారిది జీవన్మరణ సమస్య. కాంపిటేషన్ పెరిగిపోయింది. రాకరాక గుర్తింపు వచ్చింది.ఇక్కడ నుంచి నిలబెట్టుకోవాలి. ఆ కామన్ సెన్స్ తో పని అవుతుందని భావించినట్టున్నారు.
కొహ్లీ, రోహిత్ వీరిద్దరూ సాధించాల్సినవి ‘టీ 20లో’ ఏమీలేవని అంటున్నారు. ఇంత ఆలస్యం చేయడానికి కారణం, వారి ఆట కాదు, వారి వయసేనని అంటున్నారు. అందుకే వీరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం బీసీసీఐ పెద్దలందరిలో ఉందనే భావన వ్యక్తమవుతోంది.
ఇద్దరూ కూడా అవసరానికి మించి క్రికెట్ ఆడారు. అందుకే యువకులకు అవకాశం ఇవ్వాలనేది కాన్సెప్ట్. ఒకవేళ వీరిని కాదంటే భారతదేశంలో అభిమానుల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకునే స్థితిలో టీమ్ మేనేజ్మెంట్ లేదు. అందుకని బాల్ ని బీసీసీఐ కార్యదర్శి జై షా కోర్టులో వేశారు. ఆయన చేసేది లేక ఇద్దరికీ అవకాశం ఇచ్చి, రోహిత్ కి కెప్టెన్సీ అప్పగించారని అంటున్నారు.
ఒకవేళ ఇద్దరినీ కాదంటే, ఆ ప్రభావం టీ 20 ప్రపంచ కప్ మీద కూడా పడుతుందని అంటున్నారు. అందువల్ల ఆఫ్గాన్ టూర్ వరకు ఎంపిక చేసి, తర్వాత ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా ముందుకు వెళ్లాలనేది ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు.
బహుశా వీరిద్దరికీ ఇదే ఆఖరి టీ 20 వరల్డ్ కప్ కాబట్టి, అవకాశం ఇవ్వకతప్పలేదని అంటున్నారు. అయితే యువకులకు ఇంకా వయసుంది, వారు కూడా ప్రతీ మ్యాచ్ ఓ ఇరగదీసి ఏమీ ఆడేయడం లేదు. ఒకటి ఆడితే రెండు డకౌట్లు, ఒకటి యావరేజ్ అన్నట్టే ఉంది. యశస్వి జైస్వాల్, శ్రేయాస్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అందరి పరిస్థితి దాదాపు అలాగే ఉంది.
ఒక్క రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ బాగా ఆడారు. రుతురాజ్ కి గాయం వల్ల చోటు దక్కలేదు. రింకూ సింగ్ బ్రహ్మండంగా ఆడుతున్నాడు. ఈలోపు రిషబ్ పంత్ వస్తే, తన సీటుకి ఎసరు రావడం ఖాయమని అంటున్నారు. ఈలోపు తను ప్రూవ్ చేసుకొని, జట్టులో స్థానం ఖాయం చేసుకోవాలని అంటున్నారు.
ఇక చివరిగా అందరూ చెప్పే మాటేమిటంటే, మొత్తం కుర్ర బ్యాచ్ తో ముందుకెళ్లడం ప్రమాదమే అంటున్నారు. బాధ్యతగా ఆడే ఇద్దరు సీనియర్లు రోహిత్, కొహ్లీ ఉండటం ఎళ్లవేలలా జట్టుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు. లేకపోతే ఎవడు ఎవడి మాటా వినడని కూడా చెబుతున్నారు.