Ind vs Eng test 2024 (sports news in telugu):
భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మరొక్క వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్ లో చేరతాడు. అది కూడా అతి తక్కువ మ్యాచ్ ల్లో ఈ క్లబ్ లో చేరిన క్రికెటర్ అవుతాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్ లో అప్పటికే 3 వికెట్లు తీసి 499కి చేరుకున్నాడు. ఇంకా ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
62 ఓవర్ అశ్విన్ చేతికి కెప్టెన్ బాల్ ఇచ్చాడు. ఐదో బాల్ వేశాడు. స్ట్రయికింగ్ లో ఉన్న టామ్ హార్ట్ లీ రివర్స్ స్వీప్ ఆడాడు. అది క్యాచ్ గా మారి రోహిత్ శర్మ చేతికి వచ్చింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ హార్ట్ లీని అవుట్ గా ప్రకటించాడు. ఒకవైపు అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరానన్న సంతోషం, మరోవైపు టీమ్ ఇండియాలో 8వ వికెట్ పడిందన్న ఆనందం తాండవిస్తున్న సమయంలో హార్ట్ లీ రివ్యూకి వెళ్లాడు.
అక్కడ సీన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. బాల్ ట్రాకింగ్ లో బంతి మొదట హార్ట్ లీ ముంజేతిని తాకి బ్యాట్ ని తాకినట్టు కనిపించింది. దాంతో డీఆర్ఎస్ లో థర్డ్ అంపైర్ నాటౌట్ అని అన్నాడు. ఇది ఎలా సాధ్యమని అశ్విన్, రోహిత్ విస్మయం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న అంపైర్ తో వాదన పెట్టుకున్నారు.
నిజానికి అంపైర్ కి కూడా అర్థం కాలేదనుకుంటా, దాంతో తాను ఏమని అనుకున్నాడో వివరించే ప్రయత్నం చేశాడు. నేను స్లిప్ లో క్యాచ్ అనుకుని అవుట్ ఇచ్చాను. ఎల్బీకి కాదని అన్నాడు. ఇదేం సమాధానమని టీమ్ ఇండియా క్రికెటర్లు తలలు పట్టుకున్నారు.
ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన వారికే అంత గందరగోళంగా మారినప్పుడు మనమెంత? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మాత్రం దానికి డీఆర్ఎస్ ఎందుకు? అని కొందరు అంటున్నారు.
క్యాచ్ విషయంలో కూడా అంపైర్ అవుట్ ఇచ్చింది, కాదు అని రివర్స్ కావడం ఇక్కడే చూస్తున్నామని కొందరు అంటున్నారు. ఏదైతేనేం నాలుగోరోజు టీమ్ ఇండియా విజయం సాధించడంతో ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడిపోయింది.