Robin Uthappa says Virat Kohli for his changes after Amit Mishra’s allegations: వయసుతో పాటు విరాట్ కొహ్లీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కుర్రాడిగా ఉన్న విరాట్ కొహ్లీకి, నేడు చూస్తున్న వ్యక్తికి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనుష్కతో వివాహమైన తర్వాత అతనిలో చాలా మార్పు వచ్చింది. కుటుంబానికి సమయం వెచ్చిస్తున్నాడు. అనుబంధాలకి విలువిస్తున్నాడు. ఈ సమయంలో అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు నెట్టింట వేడి పుట్టించాయి.
తను స్నేహితులు, సహచరులను చూసే విధానంలో తేడా వచ్చింది. కెప్టెన్ అయ్యాక మారిపోయాడని మిశ్రా అన్నాడు. నాలుగు డబ్బులు వచ్చిన తర్వాత ఎవరైనా కలిస్తే, సాయం కోసమే వస్తున్నారనే ధోరణిలో వ్యవహరిస్తున్నాడని చెప్పిన మాటలు సంచలనం స్రష్టించాయి. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. కొహ్లీలో అప్పటికి-ఇప్పటికి చాలా మార్పు వచ్చిందని అన్నాడు. ఇదే మాటతో రాబిన్ ఉతప్ప కూడా ఏకీభవించాడు.
కొహ్లీ కెరీర్ ఆరంభంతో పోలిస్తే, ఇప్పుడు చాలా పరిణితి చెందాడని అన్నాడు. ఢిల్లీ జట్టుకు ఆడుతున్నప్పటి నుంచి విరాట్ ని చూస్తూనే ఉన్నాను. నిరంతరం అతను ఎదుగుతున్న తీరు చాలా గొప్పగా ఉంది. 15 ఏళ్ల కిందట క్రికెట్ లో అడుగుపెట్టినప్పుడు అతను క్రికెట్ గురించే ఆలోచించేవాడు. ఇప్పుడు కూడా అంతే. ఏ సందర్భంలోనైనా తన నోటి నుంచి క్రికెట్ అంశాలే వస్తాయి. తను అదే ప్రపంచంలో ఉంటాడు. నిరంతరం అలా ఆలోచించడమే తన బలం అని చెప్పాడు.
Also Read: బెస్ట్ ఫీల్డర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్ ముగిసినట్టేనా?
విరాట్ కొహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడు. ఈసమయంలో తనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనెలా రియాక్ట్ అవుతాడని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు చెబుతున్న శశాంక్, ఉతప్ప ఇద్దరూ కూడా ఒకప్పుడు విరాట్ వేరు, ఇప్పుడు వేరని అంటున్నారు.
మరి అమిత్ మిశ్రా అన్నమాటలను ఎందుకు అలా తీసుకోరని కొందరంటున్నారు. కాకపోతే తను విరాట్ మాట తీరును కాకుండా, తన వద్దకు వచ్చేవాళ్లని, డబ్బుల కోసమే వచ్చారన్నట్టుగా చూస్తున్నాడని అనడంతో మంట రేగింది. ఇప్పుడిదే అంశంపై నెట్టింట వేడి వేడి చర్చ జరుగుతోంది.