Mohammad Rizwan: పాకిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో 171 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో తను టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా రికార్డ్ నెలకొల్పాడు.
అయితే ఈ రికార్డ్ గతంలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు మీద ఉండేది. 2022లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పంత్ 146 పరుగులు చేశాడు. ఇప్పుడు రిజ్వాన్ దానిని అధిగమించాడు. అంతేకాదు దీంతో పాటు పంత్ రికార్డ్ మరొక దానిని తను ఓవర్ టేక్ చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ లో ఓవరాల్ గా అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు.
Also Read: బాబర్ పై బ్యాట్ విసిరిన రిజ్వాన్ : డబుల్ సెంచరీ మిస్ అయినందుకేనా?
పంత్ డబ్ల్యూటీసీల్లో 1575 పరుగులు చేస్తే, రిజ్వాన్ 1658 పరుగులు చేయడం విశేషం. అయితే రిజ్వాన్ గొప్ప బ్యాటరేకాదు, మంచి వికెట్ కీపర్ అని కూడా చెప్పాలి. ఇదే టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా అద్భుతమైన క్యాచ్ అందుకుని, అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
అయితే చాలా సందర్భాల్లో పాకిస్తాన్ జట్టు అందరూ అవుట్ అయినా సరే, తనొక్కడు ఒంటరిగా పోరాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే మ్యాచ్ ఓడిపోవచ్చు, గెలవచ్చు కానీ రిజ్వాన్ మాత్రం పట్టుదలతో పోరాడతాడు. మ్యాచ్ లో అంకిత భావంతో ఆడే అతికొద్దిమంది పాక్ క్రికెటర్లలో తనొక్కడని చెప్పాలి.