2022 డిసెంబర్ లో ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ చాలా స్పీడుగా కోలుకుంటున్నాడు. భారత వికెట్ కీపర్ గా, ధనాధన్ క్రికెట్ ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ప్రస్తుతం ట్రైనింగ్ లో వేగం పెంచాడు.
జిమ్ లో బరువులు ఎత్తే దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి, తను రెడీ అవుతున్నట్టు తెలిపాడు. ఇంకా నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కి సిద్ధమై, ఢిల్లీ క్యాపటిల్స్ తరఫున ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. అంతేకాదు బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
రిషబ్ పంత్ కెరీర్ ని చూస్తే, అంతర్జాతీయ మ్యాచ్ లకన్నా, రంజీలు, లీగ్ మ్యాచ్ లు, ఐపీఎల్ లో రిషబ్ పంత్ కి బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆ స్థాయి ప్రదర్శన కనిపించకపోయినా, టెస్ట్ మ్యాచ్ ల్లో మాత్రం తన మార్క్ ఆట తీరు ప్రదర్శించాడు.
విదేశీ పిచ్ లపై మంచి ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఓడిపోయే టెస్ట్ లను కాపాడాడు. డ్రా చేశాడు. కొన్ని గెలిపించాడు కూడా…మొత్తానికి తనలో గొప్ప క్రికెటర్ ఉన్నాడని రుజువు చేసుకున్నాడు.
33 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 5 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో నిలిచాడు. 30 వన్డేల్లో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలతో 865 పరుగులు చేశాడు. 66 టీ-20 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు. మూడు అర్థ సెంచరీలున్నాయి.
ప్రస్తుతం డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అందుకే ఎలాగైనా ఫిట్ నెస్ సాధించి ఐపీఎల్ లో ఆడి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే వచ్చే టీ 20 వరల్డ్ కప్ కి జట్టులో చోటు సంపాదించాలని భావిస్తున్నాడు.
అయితే ఇప్పుడు టీమ్ ఇండియాలో చోటు చాలా కష్టంగా ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో చాలామంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. టీ 20లో అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇంకా వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ రెడీగా ఉన్నారు.
వీరందరినీ దాటుకుని రావడం అంత ఈజీ కాదని సీనియర్లు అంటున్నారు. సీరియస్ గా ఆడాలి, ఆషామాషీగా ఆడితే లాభంలేదని అంటున్నారు. కాకపోతే చిన్నవయసులోనే టీమ్ ఇండియాలోకి రావడం, సెలక్టర్ల నుంచి భావి భారత క్రికెటర్ గా ప్రశంసలు అందుకోవడం కలిసొచ్చే అంశాలుగా చెప్పాలి. అందుకనే తను త్వరగా కోలుకుని భారత జట్టుతో కలిసి సేవలందించాలని, పూర్వవైభవం రావాలని కోరుకుందాం.