Rishabh Pant Latest Instagram Post Hints at Joining CSK: టీమ్ ఇండియాలో అదృష్టవంతుడు ఎవరంటే రిషబ్ పంత్ అని చెప్పాలి. మరణపు అంచుల వరకు వెళ్లి వచ్చి, తిరిగి ఆరోగ్యవంతుడై, ఫిట్ నెస్ సంపాదించి, జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఆత్మీయ మిత్రుడుగా ఉంటాడు, అలాగే మహేంద్ర సింగ్ ధోనీకి శిష్యుడిగా ఉంటాడు. అలా అందరితో కలివిడిగా ఉండే రిషబ్ పంత్ ఉన్నట్టుండి.. ఒక కుర్చీలో స్టయిల్ గా కూర్చుని స్టిల్ ఇచ్చాడు.
కుర్చీలో అందరూ కూర్చుంటారు. అందులో తప్పేం ఉంది? అని అంతా అనుకుంటారు. కానీ అక్కడే ఉంది చిదంబర రహస్యం. ఆ కూర్చోవడం ఎలా కూర్చున్నాడంటే, కబాలీ సినిమాలో రజనీకాంత్ కూర్చున్నట్టు కూర్చున్నాడు. అయితే ఏంటి? రజనీకాంత్ లా కాకపోతే, చిరంజీవిలా కూర్చుంటాడని అనుకుంటున్నారా?
అదేనండీ బాబూ.. ఇప్పుడదే నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. మనవాడు రజనీకాంత్ స్టయిల్ లో కూర్చున్నాడంటే, ఏమిటి అర్థం? రజనీ ఎక్కడివాడు.. తమిళనాడు.. మరి దాని క్యాపిటల్ ఏమిటి చెన్నయ్.. ఇప్పుడర్థమైందా? చిక్కుముడి వీడిందా? అంటున్నారు.
Also Read: ఐపీఎల్.. ఆరుగురు కెప్టెన్లు మారతారా?
అదేనండీ రిషబ్ పంత్ త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్ కి గుడ్ బై చెప్పి.. చెన్నయ్ సూపర్ కింగ్స్ లో చేరనున్నట్టు చెప్పకనే చెబుతున్నాడని అంటున్నారు. అంటే జనానికి ఒక హింట్ ఇచ్చాడన్నమాట. మరి రిషబ్ పంత్ అంటే ఏమనుకున్నారు.. కుర్రాడు మామూలోడు కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. గతంలో ఇదే స్టిల్ను ఎంఎస్ ధోనీ కూడా పెట్టాడు. తలైవా స్టైల్లో కూర్చొని ఫొటో దిగాడు.
ఇప్పుడు సేమ్ టూ సేమ్ పంత్ దించేశాడు. దీంతో సీఎస్కేలోకి పంత్ రావడం కన్ ఫర్మ్ అంటున్నారు. ఒకవేళ సీఎస్కేలోకి వస్తే, రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితేమిటి? అంటున్నారు. అయితే పంత్ వస్తే కెప్టెన్ గానే వస్తాడు కదా అంటున్నారు. ఇదొక తలనొప్పి రెడీగా ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే తను జట్టుని ఫైనల్ వరకు చేర్చలేకపోతున్నాడనే భావనలో ఉన్నారని అంటున్నారు.