Cricket In Olympics| క్రీడాభినుమానులలో క్రికెట్ అభిమానులు వేరయా.. అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. క్రీడలన్నింటిల్లో క్రికెట్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా యూరోప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అయితే క్రికెట్ అంటే ఓ పిచ్చి. కానీ అదే క్రికెట్ కు అమెరికా ఖండంలో మాత్రం పెద్దగా ఆదరణ లేదు. అందుకే గత టి20 ప్రపంచ కప్ అమెరికాలో నిర్వహించారు. కానీ ఆశించనంత ఫలితం దక్కలేదనే విమర్శలు నిర్వహకులు ఎదుర్కొన్నారు. అయితే అమెరికాలో క్రికెట్ పట్ల ప్రజలను ఆకర్షించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది. అందుకుగాను ఒలింపిక్స్ లో క్రికెట్ ఆటను తీసుకురాబోతున్నారు.
నాలుగేళ్ల తరువాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగబోయే ఒలింపిక్స్ 2028లో క్రికెట్ తీసుకురాబోతన్నట్లు అక్టోబర్ 16, 2023న ఒలింపిక్స్ కమిటీ నిర్ణయించింది. ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించారు.
”ఒలింపిక్స్ లో క్రికెట్ తీసుకురావడమేని చాలా అసక్తికర విషయం. దీనివల్ల క్రికెట్ ఆట ప్రపంచంలో ఇంకా వ్యాపిస్తుంది. నేను గత 15-20 ఏళ్ల నుంచి చాలా కమిటీల చర్చల్లో పాల్గొన్నాను. ప్రతీసారి క్రికెట్ ను ఒలింపిక్స్ లో తీసుకురావాలని వాదించిన వారిలో నేను ఉన్నాను. చివరికి 2028 ఒలింపిక్స్ క్రికెట్ రాబోతోంది. అందుకుగాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. మరో నాలుగేళ్లు మాత్రమే.. ఒలింపిక్స్ లో క్రికెట్ రావడంతో అమెరికాలో కూడా క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది. క్రికెట్ కు కొత్త ఆడియన్స్ వస్తారు. ఇది కేవలం అమెరికా గురించి మాత్రమే కాదు. ఒలింపిక్స్ అంటే ప్రపంచ నలుమూలల నుంచి ఆటగాళ్లు ఆసక్తి చూపుతారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు నిర్వహించే విషయంలో కొంత ఇబ్బంది ఉంది. కేవలం ఆరు లేదా ఏడు జట్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. అందుకే ఒలింపిక్స్ క్రికెట్ కు క్వాలిఫైయింగ్ నిర్వహిస్తారను కుంటున్నాను. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా చూస్తే.. క్రికెట్ కు కొత్త మార్కెట్ లభిస్తుంది. క్రికెట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది.” అని పాంటింగ్ తన అభిప్రాయాలు తెలిపారు.
ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్ నిజానికి 128 ఏళ్ల క్రితమే ఉంది. కేవలం ఒకే ఒకసారి నిర్వహించారు. 1900 సంవత్సరంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు ఆ పోటీల్లో పాల్గొన్నాయి. అప్పుడు ఇంగ్లండ్ జట్టు బంగారు పతకం కూడా సాధించి విజేతగా నిలించింది. ఇప్పుడు 2028లో మళ్లీ క్రికెట్.. ఒలింపిక్స్ లో 128 ఏళ్ల తరువాత ఎంట్రీ ఇవ్వబోతోంది.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
ఒలింపిక్స్ పోటీల నుంచి క్రికెట్ ఆటను తీసేయడానికి బలమైన కారాణాలున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒలింపిక్స్ కు వ్యతిరేకించడంతో అది జరిగింది. పైగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అందుకు అంగీకరించలేదు. ఇండియా క్రికెట్ బోర్డు.. బిసిసిఐ కూడా దీనికి వ్యతిరేకమే. కానీ 2017లో ఇంగ్లండ్ బోర్డు.. ఒలింపిక్స్ పోటీలకు ఇక తాము వ్యతిరేకం కాదని తెలపడంతో ఐసిసి, బిసిసిఐ కూడా అభ్యంతరం చెప్పలేదు. 2020లో అమెరికా క్రికెట్ బోర్డు.. ఒలింపిక్స్ లో క్రికెట్ మళ్లీ తీసుకురావాలని ప్రతిపాదన చేసింది. ఒలింపిక్స్ కమిటీ అందుకు అంగీకారం తెలపడంతో 2028, 2032 ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు కూడా జరగబోతున్నాయి. అయితే ఇందులో భారత్ కు చోటు దక్కుతుందా? లేదా? అనే విషయంపై అనుమానాలున్నాయి.
Also Read: వినేశ్ ఫోగట్కు గోల్డ్ మెడల్..!