Marlon Samuels : ఒకప్పుడు వెస్టిండీస్ టీమ్ లో 11మందికి 11మంది కూడా దిగ్గజ ఆటగాళ్లు ఉండేవారు. వారు మిగిలిన జట్లను గడగడమని వణికించేవాళ్లు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రభ మసకబారింది. తర్వాత జట్టు మొత్తంగా కాకుండా ఒకొక్కరు అద్భుతాలు సృష్టించేవారు. వారిలో బ్రియాన్ లారా, క్రిస్ గేల్ లాంటివాళ్లున్నారు. వీరితోపాటు శామ్యూల్స్ అని ఒక ప్లేయర్ కూడా ఉన్నాడు. తను కూడా మ్యాచ్ విన్నర్ గానే ఉండేవాడు. ఎన్నో రికార్డులు సాధించి క్రికెట్ నుంచి రిటైర్ అయి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటున్నాడు.
అలాంటి తనపై ఐసీసీ ఆరేళ్లపాటు నిషేధం విధించింది. ఇదేటిది ఆడలేని ఆటగాడు, రిటైరైపోయినోడు, వయసైపోయిన ఆటగాడి మీద నిషేధం ఏమిటి? అని నెట్టింట తెగ చర్చ నడిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే …
2019 టీ10 లీగ్ మ్యాచ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించాడంటూ శామ్యూల్స్ మీద అభియోగాలు నమోదయ్యాయి. వాటన్నింటిపై సుదీర్ఘ కాలం విచారణ జరిగింది. అనంతరం శామ్యూల్స్ వాదనలను కూడా ఐసీసీ పరిశీలించింది.
అన్నీ చూసి చివరకు శామ్యూల్స్ ని దోషిగా తేల్చింది. ఆరేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తను అవినీతికి పాల్పడ్డాడా? మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? లేకపోతే బుకీలతో మాట్లాడాడా? లేకపోతే ఏం జరిగిందనేది అక్కడ తెలీదు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం అవేమీ బయటకు చెప్పకుండా అవినీతి నిరోధక కోడ్ ను మాత్రం ఉల్లంఘించాడని తెలిపింది.
2012, 2016లలో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. అప్పటి ఫైనల్ మ్యాచ్లలో టాప్ స్కోరర్గా నిలిచి, జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించింది శామ్యూల్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి క్రికెటర్ తప్పు చేశాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
18 ఏళ్ల పాటు వెస్టిండీస్ టీమ్ కి సేవలందించిన శామ్యూల్స్ దాదాపు 300లకు పైగా మ్యాచ్లు ఆడాడు. 17 సెంచరీలు చేశాడు. వన్డేలలో వెస్టిండీస్కు నాయకత్వం వహించాడు. వెస్టిండీస్ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్లు ఆడిన శామ్యూల్స్.. 11,134 పరుగులు చేశాడు. 152 వికెట్లు పడగొట్టాడు.
2020 నవంబరులో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. తర్వాత ఆరేళ్లపాటు నిషేధానికి గురయ్యాడు. తనింక ఎటువంటి లీగ్స్, క్లబ్స్ తరఫున కూడా క్రికెట్ ఆడటానికి లేదని తేల్చి చెప్పారు.