Hanuma Vihari : భారత జాతీయ జట్టులో టెస్ట్ మ్యాచ్ లు ఆడే హనుమ విహారి రాజకీయాలకు బలైపోతున్నాడనే సందేహాలు నెట్టింట గుప్పుమంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం విహారి ఆంధ్రాజట్టుకి కెప్టెన్ గా ఉన్నాడు. కానీ సడన్ గా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ కి కెప్టెన్సీ నుంచి ఆంధ్రా క్రికెట్ సంఘం తప్పించింది. వెంటనే సీనియర్ బ్యాటర్ రికీ భుయ్ కి పగ్గాలు అప్పగించింది.
ఎందుకు విహారిపై సడన్ గా చర్యలు తీసుకున్నారంటే, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాజట్టులో ఒక రికమండేషన్ క్యాండిట్ ఉన్నాడు. అతనికి, విహారికి పడటం లేదు. మొన్న ఒకరోజు అతనిపై విహారి సీరియస్ అయ్యాడంట. దాంతో ఆ రికమండేషన్ క్యాండిట్ అయ్యతో చెప్పి, ఒత్తిడి చేయించాడంట.
దాంతో ఆ పెద్దమనిషి.. భారతదేశ క్రికెట్ ను పరిరక్షించే పాత్రలో ప్రవేశించాడు. తన కొడుకుని తిట్టినోడు కెప్టెన్ గా ఉండకూడదని హుకుం జారీ చేశాడని సమాచారం. ప్రభుత్వ పెద్దలు కల్పించుకోవడంతో ఉన్నత స్థాయిలో ఆంధ్రా సంఘంపై ఒత్తిడి వచ్చిందని అంటున్నారు.
దీంతో విధిలేని పరిస్థితుల్లో విహారిని తప్పించారని అంటున్నారు. అయితే బయటకి మాత్రం కలరింగ్ ఇస్తున్నారు. విహారి బ్యాటింగ్ పై మరింత శ్రద్ధ పెడతానని చెప్పడం వల్లే, అతనికి విశ్రాంతిని ఇచ్చామని చెబుతున్నారు. కానీ అసలు విషయం ఇదేనని అంటున్నారు.
నిప్పులేనిదే పొగ రాదు కదా.. ఇంతకీ ఆ రికమండేషన్ క్యాండిట్ ముంబై జట్టులోని 15మంది సభ్యుల్లో ఒకడిగా ఉన్నాడు. కానీ 11మంది ఫైనల్ లిస్ట్ లో మాత్రం లేడు. ఇదండీ సంగతి..140 కోట్ల మంది భారతీయుల మనోభావాలతో ఆటలాడే ఇలాంటి నికృష్ట రాజకీయాలు ఉన్నంతకాలం దేశ క్రికెట్ ని ఎవడూ బాగు చేయలేడని నెట్టింట తిట్టిపోస్తున్నారు.
2018లో టీమిండియా టెస్టు జట్టులోకి హనుమ విహారి వచ్చాడు. ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత జట్టు ఓడిపోయే స్థితిలో విహారి వీరోచిత పోరాటం చేసి, డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 839 పరుగులు చేశాడు. ఒక సెంచరీ చేశాడు. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్పై టెస్టు మ్యాచ్ ఆడాడు. తర్వాత మళ్లీ విహారికి పిలుపు రాలేదు.
ఉత్తరాది వారికి ఒకటికి పదిసార్లు అవకాశాలిస్తారు. కానీ దక్షిణాదివారికైతే ఒకట్రెండు అవకాశాలిచ్చి వదిలేస్తారు. ఏదైనా ఉత్తరాది వారిపై ఉన్న శ్రద్ధ, దక్షిణాది వారిపై లేకపోవడం ఒక శాపంగా మారిపోయింది. అది విహారి విషయంలో మరోసారి రుజువైంది.