England Cricket: ఏ ఆటలో అయినా గొడవలు సహజం. ముఖ్యంగా ప్రపంచమంతా తిరిగి చూసే క్రికెట్లో గొడవలు అనేవి మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ గొడవల వల్ల క్రికెటర్ల పర్సనల్ జీవితం ప్రభావితం అవుతుంది. మరికొన్నిసార్లు టీమ్పై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెట్లో పలు అవకతవకలు ఉన్నాయని, పలు విషయాలను పర్సనల్గా తీసుకోవడం వల్ల ఆ టీమ్ తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు తాజాగా బయటపెట్టారు.
ఇంగ్లాండ్ క్రికెట్ జాతి బేధాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దాని వల్ల టీమ్ చాలా ఎఫెక్ట్ అవుతుందని నిపుణుల రిపోర్టులో తేలింది. ఎప్పటినుండో ఇలాంటి సమస్యలు ఉన్నాయని కూడా ఇంగ్లాండ్ క్రికెట్ ఛీఫ్స్ దీని గురించి పట్టించుకోవడం లేదని రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో వారు స్పందిస్తూ త్వరలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెడతామన్నారు. ఆటపై ఇలాంటి వాటి ప్రభావం పడకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
2021లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ).. ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్ (ఐసీఈసీ) అనే కమిషన్ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెట్లో ఉన్న సమస్యలను బయటపెట్టడానికి, స్టడీ చేయడానికే ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. ఇంగ్లాండ్ టీమ్తో ఆడుతున్న సమయంలో జాతికి సంబంధించి తనతో అసభ్యంగా మాట్లాడారని పాకిస్థాన్కు చెందిన ఒక బౌలర్ 2020 సెప్టెంబర్లో ఆరోపణలు చేశాడు. దీంతో ఈ విషయాలు గురించి కనుక్కోవడం కోసం ఈసీబీ.. ఐసీఈసీని ఏర్పాటు చేసింది.
ఐసీఈసీ దాదాపు 4000 మందిని ఈ విషయంలో విచారించగా అందులో 50 శాతం మంది ఇంగ్లాండ్ క్రికెట్లో జాతి బేధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. కేవలం పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఈ విషయంలో వేధింపులకు గురయ్యారని ఐసీఈసీ తేల్చింది. ఇప్పటివరకు ఈ విషయంలో ఈసీబీ తగిన చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని కూడా బయటపెట్టింది. జాతి బేధాలు అనేవి అన్ని విభాగాల్లో ఉన్నాయని, ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్లో దీని వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారని ఐసీఈసీ అధికారులు చెప్తున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.