IPL 2024 68th Match Royal Challenge Bangalore won by 27 Runs: ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్ చివరి వరకు టెన్షన్ టెన్షన్ గా సాగింది. రెండు పులులు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో అలా మ్యాచ్ సాగింది. 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నయ్ చివరి రెండు ఓవర్లలో హైడ్రామా హై పీక్స్ కి వెళ్లింది. నిజానికి 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నయ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఉంది.
అప్పటికి చెన్నై గెలవాలంటే 52 పరుగులు చేయాలి. 12 బంతులు మాత్రమే ఉన్నాయి. కానీ వారికి ఒక అవకాశం ఉంది. అదేమిటంటే 12 బంతుల్లో 35 పరుగులు చేస్తే చాలు. ఓడినా ప్లే ఆఫ్ కి చేరుతుంది. ఎందుకంటే.. ఆర్సీబీ 18 పరుగులు పైనే గెలవాలి. అదీ లెక్కన్న మాట.
అందుకని చెన్నై 34 పరుగులు చేస్తే చాలు. అందరిలో టెన్షన్ మొదలైంది. అప్పటికే రవీంద్ర జడేజా బ్రహ్మాండమైన ఊపులో ఉన్నాడు. ధోనీ కూడా ఎడాపెడా కొడుతున్నాడు. చెన్నై వెళుతుందా? ఆర్సీబీ వెళుతుందా? స్టేడియంలో అందరూ మునివేళ్లపై కూర్చున్నారు.
ఒక ఓవర్ గడిచింది. 18 పరుగులు వచ్చాయి. అప్పుడు 6 బంతుల్లో 34 పరుగులు చేయాలి. అంటే చెన్నై 16 కొడితే చాలు. ఇదేట్రా భగవంతుడా.. ఇలా వచ్చింది పరిస్థితి అని అంతా అనుకున్నారు. రవీంద్ర జడేజా దంచి కొడుతున్నాడు. అప్పటికి 20 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లు కొట్టి 42 పరుగులు చేసి నాన్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. ఆఖరి ఓవర్ ధోనీ స్ట్రయికింగ్ కి వచ్చాడు. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ బౌలింగుకి వచ్చాడు.
Also Read : ఆ రెండు ఘటనలు మరిచిపోలేను: విరాట్ కోహ్లీ
మొదటి బాల్ ని ధోనీ సిక్స్ కొట్టాడు. అది వెళ్లి స్టేడియం అవతల పడింది. అంతే స్టేడియం మోత మోగిపోయింది. అప్పుడు 5 బాల్స్ లో 10 కొడితే చాలు చెన్నై ప్లే ఆఫ్ కి వెళుతుంది. రెండో బంతికి ధోనీ అవుట్ అయిపోయాడు. అప్పుడు 4 బాల్స్ 10 పరుగులు కావాలి. మూడో బంతి పరుగు రాలేదు. నాలుగో బంతికి 1 పరుగు వచ్చింది. అప్పుడు చివరి 2 బాల్స్ లో 9 పరుగులు చేయాలి. రవీంద్ర జడేజా స్ట్రయికింగ్ కి వచ్చాడు. రెండు బాల్స్ కూడా కనెక్ట్ కాలేదు. అలా 20 ఓవర్లలో 191 పరుగుల వద్ద చెన్నయ్ పరుగు ఆగిపోయింది. ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంటే రన్ రేట్ ప్రకారం 18 పరుగులకి మరో 9 పరుగుల ముందే గెలుపు మెట్లు ఎక్కి ప్లే ఆఫ్ కి ఆర్సీబీ చేరింది. కొహ్లీ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇది ఆర్సీబీకి నాన్ స్టాప్ గా ఆరవ విజయం అని చెప్పాలి. ‘ఈ సాలా కప్ నమ్ దే’.. అనే నినాదం మళ్లీ నెట్టింట ఊపందుకుంది.
చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగు తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై చతికిలపడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వివరాల్లోకి వెళితే.. 219 పరుగుల టార్గెట్ తో మ్యాచ్ ప్రారంభించిన చెన్నై కి ఆదిలోనే కోలుకోని దెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కరెక్టుగా ఆడాల్సిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చిన్నస్వామి స్టేడియం అంతా ఒక్కసారి మూగబోయింది.
మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర నిలకడగా ఆడాడు. కానీ తనకి సపోర్ట్ ఇచ్చేవాళ్లే కరవయ్యారు. డారీ మిచెల్ (4) ఇలా వచ్చి అలా అవుట్ అయిపోయాడు. తర్వాత ఆజ్యింక రహానె (33) కాసేపు మెరిపించాడు. కానీ ఎంతో సేపు నిలబడలేదు. తను ఉంటే బాగుండేది. ఎందుకంటే రచిన్ రవీంద్ర తో కాంబినేషన్ బాగా కుదిరింది. ఇద్దరూ 9.1 ఓవర్ లో 85 పరుగులు చేసి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేశారు.
కానీ రహానె అవుట్ అయ్యాక రచిన్ రన్ అవుట్ అయ్యాడు. శివమ్ దుబె అత్యుత్సాహం కొంప ముంచింది. లేని రెండో రన్ కోసం ప్రయత్నించి తనని అవుట్ చేశాడు. 37 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసిన రచిన్ ఉండి ఉంటే, చెన్నయ్ గెలిచేదని అందరూ అంటున్నారు. తను మంచి రిథమ్ మీద ఉండటమే అందుకు కారణం.
Also Read: IPL 2024: బ్రేకింగ్ న్యూస్.. రాజస్థాన్ – కోల్కతా మ్యాచ్ రద్దు
తర్వాత శివమ్ దుబె (7), మిచెల్ శాంటర్న్ (3) వెంటనే అయిపోయారు. దాంతో గురుశిష్యలు రవీంద్ర జడేజా, ధోనీ ఇద్దరూ జట్టుని విజయతీరాల వరకు చేర్చారనే అనుకున్నారు. కానీ జడేజాకు బ్యాట్ కనెక్ట్ అవలేదు. చివరికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఆగిపోయారు. ఆర్సీబీ బౌలింగులో గ్లెన్ మ్యాక్స్ వెల్ 1, సిరాజ్ 1, యశ్ దయాల్ 2, ఫెర్గ్యూసన్ 1, కెమరాన్ గ్రీన్ 1 వికెట్లు పడగొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కి ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. విరాట్ కొహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్ డుప్లెసిస్ 39 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలివికెట్ కి 9.1 ఓవర్ లో 78 పరుగులు చేశారు.
Also Read: SRH vs PBKS, IPL 2024: పంజాబ్పై SRH విజయం
తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన రజత్ పటీదార్ కూడా తన వంతు బ్రహ్మండంగా ఆడాడు. 23 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. తర్వాత సెకండ్ డౌన్ వచ్చిన కెమరాన్ గ్రీన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో దినేష్ కార్తీక్ (14), గ్లెన్ మ్యాక్స్ వెల్ (16) మెరుపులు మెరిపించారు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 218 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చెన్నై బౌలింగులో తుషార్ దేశ్ పాండే 1, శార్దూల్ ఠాకూర్ 2, మిచెల్ సాంట్నర్ 1 వికెట్ పడగొట్టారు. మొత్తానికి ఆర్సీబీ అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్ కి చేరడం, ఐపీఎల్ 2024 సీజన్ కే హైలెట్ అని చెప్పాలి. ఆ స్ఫూర్తి, పట్టుదలని అందరూ అందుకోవాలని, యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.