IND vs ENG : హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో బెయిర్ స్టోను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత్ బౌలర్ గా ఘనతను సాధించాడు.
రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్ లు ఆడి మొత్తం 552 వికెట్లు తీసుకున్నాడు. మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 551 వికెట్లను జడేజా దాటాడు. వీరికన్నా ముందు అనిల్ కుంబ్లే 953 వికెట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మూడో స్థానంలో హర్భజన్ సింగ్ 707 వికెట్లతో ఉన్నాడు. నాలుగో స్థానంలో మొట్టమొదటి వరల్డ్ కప్ తీసుకువచ్చిన ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ 687 వికెట్లతో ఉన్నాడు. ఐదో స్థానంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ 597 వికెట్లతో ఉన్నాడు. ఇప్పుడు ఆరో స్థానంలో రవీంద్ర జడేజా 552 వికెట్లతో నిలిచాడు.
అయితే రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్ గా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 87 పరుగులు చేసి సెంచరీ దగ్గర వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీశాడు.
రవీంద్ర జడేజా ఇంత ఘనత సాధించినా తొలి టెస్టులో అటు కెప్టెన్ రోహిత్ శర్మ, మళ్లీ అశ్విన్ తో బాగా తిట్లు తిన్నాడు. వరుసగా ‘నో బాల్స్’ వేస్తుంటే, రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. కాసేపు తలపట్టుకుని, కొంచెం వెనుక నుంచి వేయమని సూచించాడు.
తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బ్యాటింగ్ చేస్తూ, ఒక షాట్ కొట్టి స్పీడుగా పరుగెత్తాడు. అయితే జడేజా కూడా పికప్ ఇచ్చి ఆగిపోయాడు. ఆ సంగతి చూడకుండా అశ్విన్ నాన్ స్ట్రయికర్ ఎండ్ లోకి వచ్చేశాడు. దీంతో ఇద్దరూ ఒక వైపు ఉండటంతో అశ్విన్ అవుట్ అయిపోయాడు. మధ్యలో కొంచెం చెప్పవచ్చు కదా… అని జడేజా మీద సీరియస్ అవుతూ అశ్విన్ పెవిలియన్ కి వెళ్లాడు.
ఇలా మంచి మ్యాచ్ ఆడి కూడా జడేజా తిట్లు తినడం నెట్టింట వైరల్ గా మారింది.