Ashwin Will Play 100th Test In Dharmasala: ఇంగ్లాండ్ సుదీర్ఘ పర్యటన ఎవరికెలా ఉన్నా టీమ్ ఇండియా వెటరన్ ప్లేయర్ 37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్కి మాత్రం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నాడు. ఇప్పుడు తన కెరీర్లో అతి ముఖ్యమైన మైలురాయిని దాటబోతున్నాడు.
ప్రతి ఇండియన్ క్రికెటర్ కలలు గనే వందో టెస్టును ధర్మశాలలో అశ్విన్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్ట్ కానుంది. మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్లో అశ్విన్ ముందు మరికొన్ని రికార్డులు కూడా ఉన్నాయి.
ఇలా టీమ్ ఇండియా తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు సచిన్ టెండుల్కర్ ఆడాడు. తను 200 టెస్ట్లు ఆడాడు. తన తర్వాత వంద టెస్టు మ్యాచ్లు ఆడిన వారిలో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సౌరబ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన అశ్విన్ చేరనున్నాడు.
Read More: టీ 20 వరల్డ్ కప్.. ఇషాన్, శ్రేయాస్ ఆడుతారా? లేదా?
అనిల్ కుంబ్లే తర్వాత భారత తరఫున 500 టెస్ట్ వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ప్రస్తుతం 507 వికెట్లతో దూసుకుపోతున్నాడు.
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. కుంబ్లే స్వదేశంలో 63 టెస్టులు ఆడి 350 వికెట్లు తీస్తే, అశ్విన్ 59 మ్యాచ్ ల్లోనే 350 వికెట్లు తీసి కుంబ్లేను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం 352 వికెట్లతో ఉన్నాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై 100 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇక కుంబ్లే 132 టెస్టుల్లో 35 సార్లు 5 వికెట్లు పడగొట్లాడు. కానీ అశ్విన్ 99 టెస్టు మ్యాచ్ల్లోనే దానిని సమం చేశాడు. ఇప్పుడు ధర్మశాలలో మరొక్కసారి ఆ ఫీట్ సాధిస్తే కుంబ్లే రికార్డ్ బ్రేక్ అవుతుంది. ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు, రిచర్డ్ హ్యాడ్లీ 86 మ్యాచ్ల్లో 36 సార్లు పడగొట్టారు.