Ravi Shastri : భారత క్రికెట్ కి ఎంతో రుణపడి ఉన్నానని సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు వేడుకలో రవిశాస్త్రి తెలిపాడు. హైదరాబాద్లో బీసీసీఐ అవార్డుల వేడుక శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. భారత క్రికెట్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలలో నేనూ ఉండటం, మరిచిపోలేనని అన్నాడు. తన క్రికెట్ జీవితంలో జరిగిన కొన్ని అనుభూతులను పంచుకున్నాడు.
తన 17 వ ఏట క్రికెట్ లో ప్రవేశించానని తెలిపాడు. 31 వ సంవత్సరంలో రిటైర్ అయ్యానని తెలిపాడు. ఇప్పడు నా వయసు 61 సంవత్సరాలు. ఈ మధ్యలో 30 ఏళ్లు బీసీసీఐ నాకు వెన్నుదన్నుగా అండగా నిలిచిందని అన్నాడు. అందుకని బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపాడు.
ఒక్క బౌలర్ గానే కాదు, బ్యాటర్ గా కూడా దేశానికి సేవలు అందించానని తెలిపాడు. సెకండ్ డౌన్ లో వచ్చాను, ఓపెనర్ గా వచ్చాను, చివరలో వచ్చాను. మళ్లీ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాను, ఇలా భారత క్రికెట్ కి తన వంతు కృషి చేశానని తెలిపాడు. సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు అందుకునే క్షణాలు ఎంతో భావోద్వేగమైనవని అన్నాడు.
అన్నింటికి మించి 1983లో తొలిసారి ఇండియా ప్రపంచకప్ కొట్టిన టీమ్ లో నేనూ ఒక సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆడకపోయినా గ్యాలరీలో ఉండి, చప్పట్లు కొట్టి అభినందించానని గుర్తు చేసుకున్నాడు.ఇన్నేళ్లలో ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ పవర్ హౌస్ గా ఎదగడం చూశాను. దీని నీడలో మహిళా జట్టు, పురుషుల జట్టు ఎన్నో ప్రయోజనాలు అందుకుంటుందని తెలిపాడు. అందుకే బీసీసీఐని కాాపాడేందుకు, భారత ప్రతిష్ఠను పెంచేందుకు ప్రతి క్రికెటర్ కృషి చేయాలని అన్నాడు.
ఈరోజు ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎంతోమంది కోచ్ లు, రకరకాల టీమ్ సహాయక సిబ్బంది, వేలాదిమంది ప్రేక్షకులు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మేం ఆడే ఆరోజుల్లో మాకిన్ని సౌకర్యాలు ఉండేవి కావు. విమాన టిక్కెట్లకు కూడా డబ్బులు వెతుక్కునే పరిస్థితి ఉండేది.
అంతేకాదు క్రికెట్ మ్యాచ్ వినాలంటే రేడియోలే ఉండేవి.అవి కూడా ఇంగ్లీషు తెలిసిన వారికే స్కోర్ తెలిసేది. అంతటి అసౌకర్యాల సమయంలో క్రికెట్ ఆడాం. ఇప్పుడు భారత క్రికెట్ ఇంత దూరం ప్రయాణించింది. దీనిని మీరు అందుకుని మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించాడు.