Ravi Bishnoi : ఆస్ట్రేలియాతో జరిగిన దైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన రవి బిష్ణోయ్, తన సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చేరాడు. మొత్తం ఐదు మ్యాచ్ ల్లో కలిపి 9 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ పవర్ ప్లేలో కీలకమైన వికెట్లు తీసి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2016లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
తనలోని గొప్పతనం ఏమిటంటే, మెయిన్ పేసర్లు ఇద్దరూ చెరో ఓవర్ వేసిన తర్వాత, ఆసిస్ ఓపెనర్లు తుక్కు కింద కొడుతుంటే, ఆ టైమ్ లో కెప్టెన్ సూర్యకి ఉన్న ఏకైక ఆప్షన్ రవి బిష్ణోయ్ అన్నమాట. అలాంటి స్థితిలో మూడో ఓవర్ లోని బిష్ణోయ్ తో బౌలింగ్ చేయించి మ్యాచ్ చేజారిపోకుండా చూసుకున్నాడు. అనుకున్నట్టుగానే వికెట్లు కూడా టపాటపా తీసి, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
ఓపెనర్లను క్రీజులో కుదురోకుండా చేయడంలో రవి బిష్ణోయ్ ది కీ రోల్ అని చెప్పాలి. వారే గానీ 10 ఓవర్ల వరకు నిలబడితే, తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ ఫ్రీగా బ్యాట్ ఝులిపించేవారు, భారీ స్కోర్లు సునాయాసంగా చేసేవారు. ఆ పరిస్థితి లేకుండా పవర్ ప్లేలో వికెట్లు తీసి మ్యాచ్ ని టర్న్ చేసిన బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు. అందుకనే తనకే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడం న్యాయమని అంటున్నారు.
ఈ సందర్భంగా రవి బిష్ణోయ్ మాట్లాడుతూ సౌతాఫ్రికా పర్యటనలో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టానని తెలిపాడు. ‘ఈ సిరీస్ తొలి మ్యాచ్లో నేను దారుణంగా విఫలమయ్యా, ఆ తర్వాత నా ప్రణాళిక ప్రకారం వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడంపైనే ఫోకస్ పెట్టానని తెలిపాడు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ పై మాట్లాడుతూ అక్కడ పిచ్లు, వాతావరణం భారతదేశంకన్నా భిన్నంగా ఉంటాయి. వీలైనంత త్వరగా అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని అన్నాడు. అప్పుడే గ్రౌండ్ లో ఆడగలమని చెప్పుకొచ్చాడు. వాతావరణంతో గెలిస్తే, చేతిలో బాల్ కి గ్రిప్ దొరికి, చెప్పినట్టు వింటుందని అన్నాడు.
టీమిండియా సౌతాఫ్రికా పర్యటన డిసెంబర్ 10న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు టీ20ల సిరీస్లో రవి బిష్ణోయ్కు చోటు దక్కడం విశేషం.