Cheteshwar Pujara : జనవరి 25 నుంచి భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ఇంకా జట్టుని సెలక్ట్ చేయలేదు. ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ 20 సిరీస్ కి సెలక్టర్లు మల్లగుల్లాలు పడ్డారు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీకి ఛటేశ్వర్ పుజారా ఒక ఛాలెంజ్ విసిరాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కు పుజారాను ఎంపిక చేయకపోవడం ఎంత పెద్ద పొరపాటో టీమ్ మేనేజ్మెంట్ కి అర్థమైంది. ఇప్పుడదే నిజమైంది. ప్రతిష్టాత్మకమైన రంజీ మ్యాచ్ లో ఛటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ చేసి, సెలక్టర్లకు ఒక బలమైన సందేశాన్ని పుజారా పంపించాడు.
రాజ్కోట్ వేదికగా జార్ఖండ్తో జరిగిన మ్యాచులో 356 బంతుల్లో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..తొలి మ్యాచ్లోనే డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో జాతీయ జట్టులోకి రీఎంట్రీకి సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. 2023లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. తనతో పాటు ఆజ్యింక రహానే కూడా స్థానం కోల్పోయాడు.
ఇప్పుడు పుజారాని తీసుకోవడం సెలక్టర్లకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. అందువల్ల తన ప్లేస్ లో పుజారాకి అవకాశం ఉంది. అలాగే శ్రేయాస్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. అతని స్థానంలో రహానే ను తీసుకోవచ్చునని సీనియర్లు చెబుతున్నారు.
ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, జట్టు సమ తుల్యత దెబ్బతీయడంలో అందె వేసిన చేయిగా పేర్కొన్న సెలక్షన్ కమిటీ మరి ఈసారి ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ లకు వీరిద్దరిని ఎంపిక చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. లేదంటే బాగా ఆడని శ్రేయాస్, యశస్విలను ఉంచి, భవిష్యత్ ఆశా జనకంగా కనిపించే గిల్ ను పక్కన పెడతారో చూడాల్సిందే.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి 2018-2019లో సిరీస్ గెలవడంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతడిని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు అధికంగా వినిపిస్తున్నాయి.