IPL : హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న చెన్నైకు రాజస్థాన్ చెక్ పెట్టింది. రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ రాయల్స్ గెలుపుబాట పట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. బట్లర్ (27), ధ్రువ్ జురెల్ (34), పడిక్కల్ (27 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాయల్స్ స్కోర్ 200 దాటింది.
చెన్నై స్పిన్నర్లు మెరుగ్గా బౌలింగ్ చేసినా.. పేసర్లు తేలిపోయారు. ఆకాష్ సింగ్, తుషార్ దేశ్ పాండే, మతీష పతిరన భారీగా పరుగులు ఇచ్చేశారు. దేశ్ పాండేకు 2 వికెట్లు, తీక్షణ, జడేజాకు తలో వికెట్ దక్కాయి.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆది నుంచి తడబడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (8) పవర్ ప్లేలో బంతులను వృథా చేసి అవుట్ అయ్యాడు. ఒక దశలో ధోనిసేన 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ ( 47) రాణించినా.. రహానె (15), రాయుడు (0) విఫలం కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. శివమ్ దూబె (52) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో చెన్నై స్కోర్ 150 దాటింది. మొయిన్ అలీ (23), జడేజా (23 నాటౌట్) కాసేపు మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. చెన్నై జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు తీశాడు. అశ్విన్ కు 2, కుల్ దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కాయి. హాఫ్ సెంచరీతో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ ప్లేస్ వెళ్లింది. చెన్నై జట్టు మూడోస్థానానికి పడిపోయింది.