Rahul Dravid : ఇంగ్లాండ్ తో జరిగిన తొలిటెస్ట్ లో టీమ్ ఇండియా ఓటమిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. మ్యాచ్ పై తనదైన శైలిలో విశ్లేషించాడు. యువకులు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో తను వారిని వెనకేసుకు వచ్చాడు.
వారింకా యువకులు. అంతర్జాతీయ టీమ్ లపై ఆడేటప్పుడు వారికి మరింత అనుభవం అవసరమని అన్నాడు. వారికింకా సమయం ఇవ్వాలని తెలిపాడు. ఇంతవరకు వారు ఇటువంటి సవాళ్లను ఎదుర్కోలేదు. ఈ మ్యాచ్ ఒక చక్కని అవకాశాన్ని కల్పించిందని అన్నాడు. రాబోవు రోజుల్లో దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని జట్టుని తయారుచేయడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యతని అన్నాడు.
ఒక విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ లాంటి సీనియర్లు జట్టులో కనీసం నలుగురైనా అవసరమని అన్నాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ మనవాళ్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ముగ్గురు సెంచరీలు మిస్ చేసుకున్నారు. 80ల్లో అయిపోయారు. బ్యాట్ కి బాల్ కనెక్ట్ అవుతూ, ఒక రిథమ్ కి సెట్ అయిన తర్వాత, అనవసర షాట్లు కొట్టి వికెట్లు పారేసుకున్నారని విశ్లేషించాడు.
వీరు ముగ్గురు సెంచరీలు చేసి ఉంటే, కనీసం 60 నుంచి 70 పరుగులు వచ్చేవి. అవి మనకు కలిసి వచ్చేవని అన్నాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నప్పుడు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
క్రీజులో నిలదొక్కుకున్న వారికెప్పుడూ ఒక సవాల్ ఉంటుంది. భారీ స్కోరు దిశగా నడిపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని గుర్తు చేశాడు.. అది ఇంగ్లాండ్ లో ఒలిపోప్ (196) చేశాడని అన్నాడు. తనొక్కడు ఆడటం వల్ల ఈరోజు ఇండియా ఓడిపోయిందనే సంగతి గుర్తు పెట్టుకోవాలని యువకులకు సూచించాడు.
ఓలిపోప్ స్వీప్ షాట్లు, రివర్స్ స్వీప్ షాట్లు ఎక్కువ ఆడాడు. రేపటి మ్యాచ్ లో తనకెలాంటి బాల్స్ వేసి కంట్రోల్ చేయాలి? అవుట్ చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టి, బౌలర్లకు ట్రైనింగ్ ఇస్తామని అన్నాడు. విశాఖలో జరగనున్న రెండో టెస్ట్ లో ఓలిపోప్ గేమ్ కి తగిన వ్యూహాన్ని రచిస్తామని అన్నాడు. అయితే తను రెండుసార్లు ఇచ్చిన క్యాచ్ లను వదిలేయడం కూడా కొంప ముంచిందని అన్నాడు.