Prakhar Chaturvedi : ఒక క్రికెటర్ ఒక సెంచరీ చేయాలంటేనే క్రీజులో కిందా మీదా పడుతుంటాడు. అలా ఎట్టకేలకు ఒక సెంచరీ చేసి గ్రౌండ్ లో ఎగురుతారు.. బ్యాట్ లు ఎగరేస్తారు.. ఆకాశం వైపు చూస్తారు. ఇలా ఒకటి కాదు సెంచరీ తర్వాత విన్యాసాలు చాలా ఉంటాయి. అలాంటిది అండర్ – 19 కూచ్ బెహర్ ట్రోఫీ 2023-2024 ఫైనల్లో ఒక అద్భుతం జరిగింది.
సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ కాదు.. ఏకంగా 404 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతను కర్ణాటకకు చెందిన ప్రకర్ చతుర్వేది. 79 ఏళ్ల కూచ్ బెహర్ ట్రోఫీ చరిత్రలో నాలుగొందల పైచిలుకు పరుగులు చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు.
నాలుగు రోజుల ఫైనల్ మ్యాచ్ లో ముంబై-కర్ణాటక జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్సులో ముంబయి 384 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టులో ప్రకర్ చతుర్వేది ఏకంగా 638 బంతులు ఎదుర్కొని.. 404 పరుగులు చేశాడు. అంతేకాదు నాటౌట్గా నిలిచాడు. ఈ గొప్ప ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 46 ఫోర్లు ఉన్నాయి. చతుర్వేదికి తోడుగా హర్షిల్ ధర్మానీ కూడా సెంచరీ (169)తో రాణించాడు.
చతుర్వేది అద్భుత ఇన్నింగ్స్ తో కర్ణాటక నాలుగో రోజు 890/8 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ఇరు జట్లు కూడా డ్రాకు అంగీకరించాయి. అయితే తొలి ఇన్నింగ్స్లో 510 పరుగులు ఆధిక్యం సాధించిన.. కర్ణాటక జట్టు ట్రోఫీని గెలుచుకుంది.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 400 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా బ్రియాన్ లారా చరిత్ర సృష్టించాడు. అయితే లారా 1990 లో టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. కానీ 400 రన్స్ చేయడానికి అతనికి 14 ఏళ్లు పట్టింది. అంటే 2004లో తను ఈ అద్భుత ఫీట్ సాధించాడు. అదే చతుర్వేది మాత్రం అండర్-19 టోర్నీలోనే.. అది కూడా నాలుగు రోజుల మ్యాచ్ లోనే 400 పరుగులు చేయడం విశేషం. ఇప్పుడీ పోలిక నెట్టింట వైరల్ గా మారింది.