Pakistan Cricket Team To Undergo Training Camp With Army(sports news today): వన్డే వరల్డ్ కప్ 2023 మిగిల్చిన చేదు జ్నాపకాలు ఇంకా పాక్ క్రికెట్ ను వెంటాడుతూనే ఉన్నాయి. చాలా దేశాలు ఏం చేశాయంటే తమ జట్టు కెప్టెన్లను మార్చాయి. కొన్ని దేశాలు జట్టు సభ్యులని మార్చాయి. కొన్ని దేశాలు కోచ్ లను మార్చాయి. ఇలా చాలా మార్పులు వన్డే వరల్డ్ కప్ తీసుకొచ్చింది. చాలామంది క్రికెటర్ల జీవితాలతో ఆటలాడింది.
ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ క్రికెట్ లో జరిగింది. ఆ దేశం కూడా రకరకాల ప్రయత్నాలు చేసింది. ముందుగా కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజామ్ ని మార్చి పారేసింది. తర్వాత కెప్టెన్ గా వన్డే, టెస్టు మ్యాచ్ లకు షాన్ మసూద్ ని ఎంపిక చేసింది. టీ 20కి వచ్చేసరికి షహీన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే వచ్చినవాళ్లు ఎలా తయారయ్యారంటే, తనికంటే ఘనుడు ఆచంట మల్లన్నలా మారారు. దీంతో మళ్లీ బాబర్ ఆజామ్ కే కెప్టెన్సీ అప్పగించారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయేలా కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే క్రికెటర్లకు పాక్ ఆర్మీలో 12 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వారి పొట్టలు పెరిగిపోయి, క్రీజులో పరుగెత్తలేక పోతున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వ్ ఐ ఒక ప్రకటన విడుదల చేశారు.
read more: చివరి టెస్టులో.. దేవదత్ పడిక్కల్ ఆరంగేట్రం
ఈ మధ్యకాలంలో ఒక్క పాకిస్తాన్ ఆటగాడు కూడా స్టాండ్స్ లోకి సిక్సర్ కొట్టడం చూడలేదని అన్నాడు. దీనిపై నెట్టింట రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ బోర్డు తీసుకున్న నిర్ణయం కరెక్టే…ఎందుకంటే అక్కడ ఐపీఎల్ లో ఆడపిల్లలు సిక్సర్లు కొడుతుంటే అద్దాలు పగిలిపోతున్నాయి…వీళ్లేంటి ఇలా ఆడుతున్నారని కోట్ చేస్తున్నారు.
ప్రతి క్రీడాకారుడి ఫిట్ నెస్ ను వేగవంతం చేసేలా ప్రణాళిక రూపొందించాలని బోర్డును కోరినట్టు బోర్డు చైర్మన్ తెలిపారు. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు కూడా ఉన్నాయని తెలిపారు. అమెరికాలో జరగనున్న టీ 20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని మిలట్రీ శిక్షణ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిగానీ సక్సెస్ అయి, పొరపాటున పాకిస్తాన్ గానీ టీ 20 ప్రపంచ కప్ నెగ్గితే, ప్రతి దేశం కూడా క్రికెటర్లను మిలట్రీలోకి పంపించడం ఖాయమని నెట్టింట కామెంట్లు వైరల్ అయిపోతున్నాయి.