PBKS vs KKR: పంజాబ్ దూకుడుగా ఆడింది. ఛేజింగ్లో కోల్కతా తడబడింది. ఈలోగా వర్షం కురిసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్నే విజయం వరించింది. 7 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై గెలిచి.. ఐపీఎల్-16 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది.
టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. భానుక రాజపక్స 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ (40; 29 బంతుల్లో 6 ఫోర్లు) కూడా రాణించాడు. జితేశ్ శర్మ (21), ప్రభ్సిమ్రన్ సింగ్ (23) ఫర్వాలేదనిపించారు. చివర్లో సామ్ కరన్ (26*; 17 బంతుల్లో) చెలరేగిపోవడంతో.. పంజాబ్ జట్టు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టార్గెట్ భారీగానే ఉంది. అయినా కోల్కతా టీమ్లో దూకుడు కొరవడింది. రెండో ఓవర్లోనే రెండు వికెట్లు పడటంతో నైట్రైడర్స్ డిఫెన్స్లో పడ్డారు. అర్ష్దీప్ బౌలింగ్లో మన్దీప్ సింగ్ (2), అనుకుల్ రాయ్ (4) వెంటవెంటనే ఔటయ్యారు. రెహ్మనుల్లా (22) క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆండ్రూ రస్సెల్ (35; 19 బంతుల్లో) రాణించాడు. వెంకటేశ్ అయ్యర్ (34), నితీశ్ రాణా (24) తమవంతు స్కోర్ పెంచారు. 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది పంజాబ్. అంతలోనే భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ 7 పరుగులతో గెలిచినట్టు ప్రకటించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు.. సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, సికిందర్ రజా, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.