Pakistan Reacts to Reports of India not touring Pakistan for Champions Trophy 2025: 2025, మార్చి నెల నుంచి ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ నకు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ లో తను ఉన్నంతకాలం ఇండియాలోనే ఉంది.
మన భారతీయులు కూడా ఆ జట్టుకి మద్దతు పలికారు. వారిని సాదరంగా ఆహ్వానించారు. అదే మాట కెప్టెన్ బాబర్ అజామ్ కూడా పదేపదే చెప్పాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా వెళ్లాలి. కానీ పాకిస్తాన్ భద్రతపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆడే ప్రసక్తి లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పేశారు. దీంతో మ్యాచ్ లను హైబ్రీడ్ మోడల్ లో నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోందనే వార్తలు వినిపించాయి.
అంటే భారత్ ఆడే మ్యాచ్ లను పాకిస్తాన్ లో కాకుండా తటస్థ వేదికల్లో నిర్వహిస్తారు. అంటే ఉదాహరణకి శ్రీలంక, లేదా బంగ్లాదేశ్ ల్లో నిర్వహిస్తారు. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ కు ఐసీసీ ఆమోదం తెలిపిందని క్రీడావర్గాలు తెలిపాయి.
ఒకవేళ ఆడితే, రెండు జట్ల మధ్య మ్యాచ్ మార్చి 1న జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ ను ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు సమర్పించింది. అందులో కచ్చితంగా ఇండియా తమ దేశం పాకిస్తాన్ రావాలని సూచించింది. లాహోరులో వారికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని చెబుతోంది. ఈ సమయంలో బంగ్లాదేశ్ కూడా తమకి పాక్ లో రక్షణ కావాలని ఐసీసీని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు.
2026లో టీ 20 ప్రపంచకప్ జరగనుంది. అందుకోసం 2025 అక్టోబరులో నిర్వహించనున్న ఆసియాకప్ ను టీ 20 ఫార్మాట్ లో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. ఒకే ఏడాది ఛాలెంజర్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో, ఆసియా కప్ ఇండియాలో జరగనున్నాయి.