Pakistan Lost The Match Because of the Worst Fielding Against USA in the ICC T20 WC: టీ 20 ప్రపంచకప్ లో యూఎస్ఏ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ అతి దారుణంగా ఉండటం వల్లే మ్యాచ్ ఓడిపోయారని చెబుతున్నారు. ఎందుకంటే దాదాపు మూడు బౌండరీలను వాళ్లు చేతుల్లోకి వచ్చినవి ఆపలేకపోయారు. అందువల్ల కనీసం 6 పరుగులైనా ఆపేవారని, అలాగే క్యాచ్ లను కూడా పట్టలేకపోయారని చెబుతున్నారు. యూఎస్ఏ విజయానికి, పాక్ ఓటమికి ఇదే కారణమని తేల్చి చెబుతున్నారు.
నిజానికి మ్యాచ్ లో యూఎస్ఏ అద్భుతమైన క్యాచ్ లు అందుకుంది. స్టార్టింగ్ లో ఓపెనర్ రిజ్వాన్ వికెట్ ని స్లిప్ లో ఇలాగే పట్టుకున్నారు. సూపర్ ఓవర్ లో ఇఫ్తికర్ వికెట్ కూడా అలాగే దొరికింది. ఇక బౌండరీ లైన్ల వద్ద కూడా బ్రహ్మండంగా కాశారు. చిరుతపులుల్లా గ్రౌండులో పరుగులెత్తారు. అంతేకాదు వారికి సొంత మైదానాలు కావడం, అక్కడ పిచ్ లపై అవగాహన ఉండటంతో చాలా సాధికారికంగా ఆడారు.
పాకిస్తాన్ పరిస్థితి ఏమీ మారలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. చివరి ఓవర్లలో ఒత్తిడిని జయించలేకపోతున్నారని చెబుతున్నారు. నిజానికి యూఎస్ఏ 19 ఓవర్లలో 145 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ లో 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఫైనల్ ఓవర్ ని రవూఫ్ వేశాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాలి. అదెందుకో బౌన్స్ అయ్యేసరికి నితీష్ కుమార్ బౌండరీ కొట్టాడు. అంతే స్కోరు సమమై సూపర్ ఓవర్ కి వెళ్లింది.
Also Read: అదరగొట్టిన స్కాట్లాండ్.. నమీబియా పై ఘన విజయం
ఆ సూపర్ ఓవర్ లో కూడా యూఎస్ఏ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. పాకిస్తాన్ బౌలర్ అమీర్ ఒత్తిడిలో మూడు వైడ్ బాల్స్ వేశాడు. యూఎస్ ఏ దానికి అదనంగా నాలుగు పరుగులు చేసింది. అలా జోన్స్ చేసినవి 11 పరుగులైతే, ఇలా ఎక్స్ ట్రా రూపంలో వచ్చినవి 7 ఉన్నాయి. ఇలా ఎన్నో కారణాలతో పాకిస్తాన్ పరాజయం పాలైంది.
అయితే మెగా టోర్నమెంట్లలో పీకలమీదకు తెచ్చుకోవడం పాకిస్తాన్ కి కొత్త కాదని చాలామంది అంటున్నారు. వాళ్లకి టెన్షన్ లో ఆడటం అలవాటేనని, అలా కప్పులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం తొలి మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి, టీమ్ ఇండియాపై గెలవడం పాకిస్తాన్ కి అనివార్యంగా మారింది. అందుకని మనవాళ్లు ఒకింత జాగ్రత్తగా ఉండాలని సీనియర్లు సూచిస్తున్నారు.