Arshad Nadeem| పాకిస్తాన్ లో ఇప్పుడు అందరి హీరో అర్షద్ నదీం. పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో అతను బంగారు పతకం సాధించాడు. బల్లెం విసరడంలో రికార్డ్ సృష్టించి చాంపియన్ గా నిలిచాడు. దీంతో పాకిస్తాన్ లో అతని పేరు మార్మోగిపోతోంది. గత 38 ఏళ్లలో ఒక పాకిస్తాన్ ఆటగాడు ఒలింపిక్ మెడల్ సాధించడం.. అది కూడా గోల్డ్ మెడల్ సాధించడం ఇదే తొలిసారి. ఒలింపిక్స్ లో విజేతగా నిలిచిన తరువాత నదీమ్ ఇటీవలే పాకిస్తాన్ తిరిగి వచ్చాడు.
పాకిస్తాన్ లో ప్రజలు, సెలెబ్రిటీలు అతనికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో అర్షద్ నదీమ్కు సన్మానం చేస్తూ.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీష్ పాకిస్తానీ కరెన్సీ రూ.10 లక్షలు (ఇండియన్ కరెన్సీ రూ.3 లక్షలు) బహుమానం అందజేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నెటిజెన్లు ఆ ఫొటోలపై మండిపడుతున్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా కూడా దీనిపై స్పందించారు. పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించిందని చెబుతూ.. చాంపియన్ అర్షద్ నదీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికి అర్షద్ నదీమ్ గర్వకారణమని తెలిపాడు. కానీ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పై మండిపడ్డారు. ”దేశం కోసం ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే.. ఆ హీరోకి కేవలం పది లక్షలు బహుమానం ఇస్తారా? ఇది చాలా అవమానకరం. అర్షద్ నదీమ్ కే కాదు.. దేశానికే అవమానం. మీరిచ్చే డబ్బులతో అతని కనీస అవసరాలు కూడా తీరవు. ఆ డబ్బులతో విమాన టికెట్లు కూడా రావు. ఆ చాంపియన్ కనీసం శుభాకాంక్షలు కూడా మనసారా తెలపరా?.. ముందు ఆ పది లక్షల ఫోటో సోషల్ మీడియా నుంచి తొలగించండి.” అని ట్విట్టర్ లో రాశాడు.
మరోవైపు ఒలింపిక్ హీరో నదీమ్.. తన గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించండి అని పాకిస్తాన్ ప్రభుత్వానికి వేడుకున్నాడు. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రం, మియా చన్నూ గ్రామంలో ఆయన కుటుంబం నివసిస్తోంది. తన గ్రామంలో మంచి రోడ్లు, వంట గ్యాస్ కనెక్షన్, ఇతర సదుపాయాలు లేవని అర్షద్ నదీమ్ తెలిపాడు. అతి పేద కుటుంబానికి చెందిన నదీమ్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించే ముందు శిక్షణ కోసం అతని గ్రామస్తులు, బంధువులు ఆర్థికంగా సాయం చేశారని తెలిపాడు. తన గ్రామానికి సమీపంలో ఓ యునివర్సిటీ నిర్మిస్తే.. మంచి రోడ్డు సదుపాయం కలుగుతుందని ఆశపడ్డాడు.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో