Couldn’t Play Properly at That Time Says Babar After USA Defeat: టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లో యూఎస్ఎ సంచలనం సృష్టించింది. పాక్ జట్టుని మట్టి కరిపించింది. ఈ క్రమంలో మ్యాచ్ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. యూఎస్ఏ జట్టు అన్నివిధాలుగా బాగా ఆడిందని అన్నాడు. నిజానికి మాకన్నా పై చేయిగా నిలిచిందని తెలిపాడు. ఇంత గొప్పగా ఆడుతుందని ఊహించలేదని తెలిపాడు. ప్రపంచ క్రికెట్ లో కొత్త దేశాలు ఇంత బాగా ఆడటం ఒక శుభపరిణామమని అన్నాడు.
ఇక మ్యాచ్ లో ఓటమిపై స్పందిస్తూ పవర్ ప్లే ని సరిగా ఉఫయోగించుకోలేకపోయామని అన్నాడు. అక్కడే వరుసగా వికెట్లు పడిపోయాయని తెలిపాడు. ఒకవైపు నుంచి వికెట్లు పడుతుంటే తర్వాత వచ్చేవాళ్లపై ప్రెజర్ పెరుగుతుంది. దాంతో నెమ్మదిగా ఆడాల్సి వస్తుందని తెలిపాడు. అలా జరగడం వల్ల పాకిస్తాన్ పెద్ద స్కోరు నమోదు చేయలేకపోయిందని తెలిపాడు.
అప్పటికి 159 పరుగులు మంచి స్కోరు అయినా బౌలింగులో కూడా అదే పొరపాటు జరిగిందని అన్నాడు. అమెరికా బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో మేం వికెట్లు తీయలేకపోయామని అన్నాడు. వాళ్లు మమ్మల్ని అవుట్ చేసినట్టు, మేం వాళ్లని మొదటి 6 ఓవర్లలో అవుట్ చేయలేకపోయామని తెలిపాడు. దాంతో వాళ్లు పవర్ ప్లేని సమర్థవంతంగా ఉపయోగించుకొని, చేతిలో నిండుగా వికెట్లతో తర్వాత భయం లేకుండా మ్యాచ్ ఆడారని అన్నాడు. అదే వారికి, మాకు తేడా అని అన్నాడు. ఈ మ్యాచ్ ని పవర్ ప్లే డిసైడ్ చేసిందని తెలిపాడు.
Also Read: అదరగొట్టిన స్కాట్లాండ్.. నమీబియా పై ఘన విజయం
పిచ్లో కొద్దిగా తేమ ఉందని తెలిపాడు. దీంతో వికెట్ రెండు విధాలుగా స్పందించిందని తెలిపాడు. అటు బౌలింగులో కొన్ని బాల్స్ ఇన్ స్వింగ్ అయ్యి ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టాయి. కొన్ని బంతులు బ్యాటర్లకి అనుకూలంగా పడ్డాయని అన్నాడు.
పిచ్ ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని బాబర్ అజామ్ అన్నాడు. ఏ బాల్ రైజ్ అవుతుందో, ఏ బాల్ ఇన్ స్వింగ్ అవుతుందో, ఏ బాల్ అవుట్ స్వింగ్ అవుతుందో, ఏది ముఖం మీదకు వస్తుందో అర్థం కావడం లేదని అన్నాడు. ఇదే మాటలను టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనడం కూడా విశేషం. కాకపోతే మేం ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాం. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా పరిస్థితులు అర్థం చేసుకొని ఆడాల్సి ఉంటుంది…ఈ మ్యాచ్ లో అక్కడ విఫలమయ్యామని తేల్చి చెప్పాడు.