Pakistan Cricket Team:కరోనా మహమ్మారి దెబ్బకు పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఆన్లైన్లోనే పాఠాలు విన్నారు. అంతేకాదు సంగీతం, నాట్యంతో పాటు వివిధ వాయిద్య పరికరాలు నేర్చుకోవడానికి కూడా అప్పట్లో చాలా మంది పిల్లలు ఆన్లైన్ క్లాసుల మీదే ఆధారపడ్డారు. ఐటీ కంపెనీలు కూడా వర్చువల్ మీటింగ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఆన్లైన్ ద్వారానే కార్యకలాపాలు సాగించాయి. కానీ, అత్యంత ప్రజాదరణ పొందిన ఏ ఆటకు కూడా కరోనా సమయంలో ఎవరూ కోచింగ్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు… పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అదే ఆన్లైన్ క్రికెట్ కోచింగ్.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు రికార్డు సృష్టించనుంది. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మిక్కీ ఆర్థర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా పనిచేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ పాక్ హెడ్ కోచ్గా సేవలందించేందుకు పీసీబీతో మిక్కీ ఆర్థర్ ఒప్పందం కుదుర్చుకున్నాడని… పాక్ మీడియా అంటోంది. ఇదే అంశంపై మాట్లాడిన పీసీబీ బాస్ నజమ్ సేథీ… ఆర్థర్తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పాడు. దాంతో, త్వరలో పాక్ క్రికెట్ జట్టు ఆన్లైన్ క్రికెట్ కోచింగ్ తీసుకోబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఉండేందుకు మొదట ఒప్పుకోని ఆర్థర్.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి, అంగీకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్గా ఉన్న ఆర్థర్… ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటానని, పాక్ జట్టు ఆడబోయే టోర్నీల్లో మెజారిటీ టోర్నీలకు ఆన్లైన్లోనే కోచింగ్ ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదనపై పాకిస్థాన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్లు ఎవరూ దొరకలేదా? అని పాక్ ఫ్యాన్స్ పీసీబీపై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు.