Olympics 2024: జులై 26 నుంచి రెండు వారాలపాటు జరిగే పారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ దాడులు జరగవచ్చని అనుమానిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ ఆధారంగా కూడా రక్షణ చర్యలు చేపడుతున్నారు. 10,500 మంది క్రీడాకారులు విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. మళ్లీ వీరికి సహాయకులు, కోచ్ లు, టీమ్ నిర్వాహకులు, ఫిజియో థెరపిస్టులు ఇలా ఎందరో ఉన్నారు.
వీరందరికి తగినట్టుగా సుమారు 45 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. పారామిలటరీ బలగాలు రంగ ప్రవేశం చేశాయి. వీరితో పాటు 10వేల మంది సైన్యం కూడా వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ క్రీడా వేదిక యుద్ధభూమిని తలపిస్తోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి భారీ స్థాయిలో మిలట్రీని దించడం ఇదే మొదటిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామం చుట్టూ పటిష్టమైన రక్షా కవచాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : విశ్వమంతా.. మనోళ్లే! ఒలింపిక్స్ లో భారత సంతతి క్రీడాకారులు
అయితే అథ్లెట్లకు ఏర్పాట్లు చేయడం ఒకెత్తు అయితే, ఇంతమంది పోలీసు, మిలట్రీకి సెపరేట్ గా ఆహారాన్ని అందించడం, వారికి టాయ్ లెట్లు, వాష్ రూమ్ లు సమయానికి అందించడం నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారనుందని అంటున్నారు.
ఇకపోతే పారిస్ లోని ఏ వేదిక వద్దకైనా 30 నిమిషాలల్లోగా భద్రతా సిబ్బంది చేరుకొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాలంగా రహదారులను నిర్మించారు. మిలట్రీ, పోలీసు వాహనాలు, అంబులెన్స్ లు స్పీడుగా వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రారంభోత్సం సందర్భంగా 150 కి.మీ. మేర గగన తలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. అవాక్స్ నిఘా విమానాలు, రీపర్ డ్రోన్లు, షార్ప్ షూటర్లతో కూడిన హెలికాప్టర్లు గగన తలంపై పహారా కాయనున్నాయి. వీరే కాకుండా 40 దేశాలనుంచి 1900 మంది పోలీసు బలగాలు పారిస్ చేరుకున్నాయి.
ఎందుకంటే తమ క్రీడాకారులకు రక్షణగా వారు వచ్చారు. మళ్లీ వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఇలా మొత్తం పారిస్ వీధులన్నీ అణువణువు ఒలింపిక్స్ ఫీవర్ తో నిండిపోయింది.