ODI World Cup 2023 : కొత్త సంవత్సరం వస్తుందంటే, అందరిలో ఏదో తెలియని ఆనందం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాత సంవత్సరం చేసిన పొరపాట్లు, అలవాట్లు సరిదిద్దుకొని, కొత్త ఏడాదిలోకి సరికొత్తగా వెళ్లాలనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుంది. అలాగే ఏడాదిలో గతించిన జ్ణాపకాలను కొందరు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
క్రీడాలోకంలోకి వస్తే, 140 కోట్ల మంది భారతీయులు మరిచిపోలేని సంవత్సరం 2023 అని చెప్పాలి. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ 2023లో టీమ్ ఇండియా అప్రతిహితంగా 10 మ్యాచ్ లు వరుసగా గెలిచి, సరిగ్గా ఫైనల్ మ్యాచ్ లో బోర్లా పడింది. భారతీయుల మనసులు వేయి ముక్కలైపోయాయి.
కాకపోతే అత్యద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా తీరును చూసి గర్వపడ్డారు. అందుకే ఓడినా సరే, వీర సైనికులుగానే అందరినీ చూశారు. కాకపోతే వరల్డ్ కప్ రేపిన గాయం మాత్రం చిన్నది కాదు. ఇదెప్పటికీ ఒక చేదు జ్ణాపకంలా చరిత్రలో మిగిలిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2023 సంవత్సరాన్ని విజయాలతో ఆరంభించిన టీమ్ ఇండియా ఓటమితో ముగించింది.
2023లో మొత్తంగా టీమిండియా 66 అంతర్జాతీయ మ్యాచులు ఆడింది. అందులో 8 టెస్టులు, 35 వన్డేలు, 23 టీ20 మ్యాచులు ఉన్నాయి.
టీ 20లో భారత్ 23 మ్యాచ్ లు ఆడింది..15 మ్యాచ్ లు గెలిచి, 7 ఇంట ఓడిపోయింది. ఒకటి మాత్రం వర్షం కారణంగా రద్దయ్యింది.
వన్డేలకు వస్తే 35 మ్యాచ్ లు ఆడిన భారత్ 27 మ్యాచుల్లో గెలిచింది. ఏడింట ఓడిపోయింది.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
టెస్టుల్లో 3 మ్యాచులు గెలిచిన భారత్.. మరో మూడింట్లో ఓడి, రెండింటిని డ్రా చేసుకుంది.
అందని ద్రాక్షగా ఐసీసీ ట్రోఫీలు
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయింది. కాకపోతే ఆసియా కప్ 2023 టైటిల్ను మాత్రం గెలుచుకుంది. ఐసీసీ ట్రోఫీల్లో విజయం సాధించలేకపోయింది. దైపాక్షిక సిరీస్ లలో మాత్రం ఎక్కువగానే విజయం సాధించింది.
2023 మిశ్రమ ఫలితాలు
ఒకరకంగా చెప్పాలంటే 2023 సంవత్సరం మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. ఆదాయం బాగానే ఉన్నా, వన్డే వరల్డ్ కప్ నిర్వహణతో ఖర్చులు బాగానే అయ్యాయి. ఇకపోతే రాజపూజ్యం పర్వాలేదు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ లో వరుసగా 10 మ్యాచ్ లు గెలవడంతో బాగానే గౌరవం దక్కింది. తర్వాత సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఓటమి లాంటి అవమానాలను బాగానే ఎదుర్కొంది.
146 ఏళ్ల ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొహ్లీ నయా రికార్డ్
ముఖ్యంగా విరాట్ కొహ్లీ వన్డేల్లో 50 సెంచరీల మార్క్ చేరుకుని సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అలాగే ఒక క్యాలండర్ ఇయర్ లో ఏడుసార్లు 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏకైక క్రికెటర్ గా నయా చరిత్ర స్రష్టించాడు. 146 ఏళ్ల ప్రపంచ క్రికెట్ లో ఎవరికీ దక్కని రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
శ్రీలంకను ఓడించి…
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని.. 2023లో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అనంతరం అదే జట్టుపై వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
న్యూజిలాండ్పై విజయభేరి
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో గెలిచింది. అలాగే వన్డే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది.
భారత్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో విజయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత్ విజయం సాధించింది. 2-1తో టెస్టు సిరీస్ గెలుచుకుని.. ట్రోఫీని నిలబెట్టుకుంది. అయితే
అనూహ్యంగా వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది. అలా 2023లో తొలి పరాజయాన్ని చవిచూసింది.
ఐపీఎల్ 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఏప్రిల్, మే నెలల్లో జరిగింది. ఇందులో యువఆటగాళ్లు చాలామంది వెలుగులోకి వచ్చారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2021-23) ఫైనల్ లో ఓటమి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సాధించిన విజయంతో వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2021-23) ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో మళ్లీ ఓడిపోయింది. మొత్తానికి టీమ్ ఇండియా ఫైనల్ ఫోబియా నుంచి బయట పడలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోనీలా చివర్లో బెస్ట్ ఫినిషర్స్ లేక టీమిండియా తడబాటు అలాగే కొనసాగుతోంది. చివరికి మరోసారి రన్నరప్గా నిలిచింది.
వెస్టిండీస్ పర్యటనలో మిశ్రమ ఫలితాలు…
చాలా కాలం తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో, వన్డే సిరీస్ను 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే టీ20 సిరీస్ను మాత్రం 2-3 తేడాతో కోల్పోయింది.
ఐర్లాండ్ పర్యటనలో..
భారత్ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో గెలుచుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియా
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్ టైటిల్ సాధించింది. ఇదొక్కటే 2023లో మిగిలిన ఆనందం అని చెప్పాలి.
స్వదేశంలో ఆస్ట్రేలియాపై గెలుపు
ఆసియా కప్ తర్వాత… ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో భారత్త కైవసం చేసుకుంది.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఓటమి
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో భారీ అంచనాల మధ్య పాల్గొన్న భారత్.. వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచింది. కానీ ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో చావు దెబ్బ తిన్నాది. దీంతో ట్రోఫీ చేతికందినట్టే అంది చేజారిపోయింది.
టీ 20 సిరీస్ లో ఆస్ట్రేలియాపై జయభేరి
వరల్డ్ కప్ అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగింది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ 4-1 తేడాతో సిరీస్ గెలుపొందింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో మిశ్రమ ఫలితాలు
భారత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉంది. టీ20 సిరీస్ను 1-1తో సమం చేసి, 3 మ్యాచుల వన్డే సిరీస్ను 2-1తో గెలిచింది. ఇక రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టులో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అలా 2023 సంవత్సరాన్ని ఓటమితో ముగించింది.
2024లో పొట్టి ప్రపంచ వరల్డ్ కప్ జరగనుంది. అందులోనైనా విజయం సాధించి ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆశిద్దాం. టీమ్ ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.