India Vs newzealand : శ్రీలంకపై వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా న్యూజిలాండ్ తో సమరానికి సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శ్రీలంకపై విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ రోహిత్ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. టాప్ ఆర్డర్ లో ఈ ముగ్గురు కీలకం కానున్నారు. వీళ్లు రాణిస్తే కివీస్ పైనా భారత్ అదే జోరు కొనసాగించడం ఖాయం.
ఇక శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్ లు ఆడే ఛాన్స్ ఉంది. మిడిల్ ఆర్డర్ లో సూర్య చెలరేగితే జట్టు భారీ స్కోర్ సాధించడం ఖాయం . బంగ్లాదేశ్ పై అద్భతంగా డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషాన్ ఆ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. కివీస్ తో సిరీస్ కు కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. మరి ఈ అవకాశాన్ని ఇషాన్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఆల్ రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటారు. ముగ్గురు స్పినర్లతో ఆడితే చాహల్, కుల్ దీప్ కు స్థానం దక్కుతుంది. అప్పుడు పేసర్ల కోటాలో షమి, సిరాజ్ కు చోటు లభిస్తుంది. ఒకవేళ ఉమ్రాన్ మాలిక్ ను తుది జట్టులోకి తీసుకుంటే.. కులదీప్, చాహల్ లో ఒకరు బెంచ్ కు పరిమితం కావాల్సిందే.
అటు పేసర్ల, ఇటు స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో శ్రీలంకపై సిరీస్ ను టీమిండియా సునాయాసంగా కైవసం చేసుకుంది. ముఖ్యంగా మూడో వన్డేలో భారత్ బౌలర్లు పంజా విసరడంతో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక బౌలర్లు ఇదే జోరును కొనసాగిస్తే కివీస్ ను కట్టడి చేయడం సులువే.
కివీస్ జట్టు కూడా బలంగానే ఉంది. పాకిస్థాన్ ను వారి సొంతగడ్డపైనే వన్డే సిరీస్ ను 2-1 తేడాతో ఓడించి ఊపుమీదుంది. స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ ,టిమ్ సౌథీ సేవలు అందుబాటులో లేకపోయినా కివీస్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ లేథమ్, ఫిన్ అలెన్ , డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఫెర్గూసన్ , మైకెల్ బ్రేస్ వెల్, ఇష్ సోధి, సాంట్నర్ తో కూడిన బౌలింగ్ దళం భారత్ బ్యాటర్లకు సవాల్ విసురుతోంది. అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో కివీస్ జట్టు సమతూకంతో ఉంది.
ఉప్పల్ మైదానంలో..
ఇప్పటివరకు ఉప్పల్ లో భారత్ 6 వన్డేలు ఆడింది. అందులో తొలి మూడు మ్యాచ్ లో పరాజయం చవిచూసింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. ఈ మైదానం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవాకాశం ఉంది.
భారత్ దే పై చేయి
ఇప్పటి వరకు భారత్ -కివీస్ మధ్య 113 వన్డే మ్యాచ్ లు జరిగాయి. అందులో టీమిండియా 55 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కివీస్ 50 మ్యాచ్ ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్ టై కాగా.. ఏడు వన్డేలు రద్దయ్యాయి. తాజా సిరీస్ సొంత గడ్డపై ఆడనుండటం భారత్ కు కలిసొచ్చే అంశం.