ICC Cricket World Cup : ఇండియాతో సెమీఫైనల్ లో తలపడే జట్టు ఏమిటో తెలిసిపోయినట్టే. దాదాపు న్యూజిలాండ్ ఖరారయ్యేలా ఉంది. ఒకవేళ పాక్ రావాలంటే మాత్రం ఇంగ్లాండ్ తో కనీసం 277 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే మొదట ఇంగ్లండ్ గానీ బ్యాటింగ్ చేస్తే ఆ అవకాశం కూడా ఉండదు.
ఒకవేళ పాక్ ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చి.. 400 పరుగులు చేసి, తర్వాత ఇంగ్లండ్ ని 130 పరుగులకే ఆలౌట్ చేయాలి. అదీ కాన్సెప్ట్. అది దాదాపు అసాధ్యం కాబట్టి న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఖాయంగా కనిపిస్తోంది. క్రీడా పండితులు ఇది ఫిక్స్ అంటున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నట్టుగానే ఉంది.
అయితే మ్యాచ్ ప్రారంభమయ్యేటప్పుడు మాత్రం వర్షం పడుతుందనే సూచనలు కనిపించాయి. దీంతో భారతీయులు తుళ్లి పడ్డారు. ఎందుకంటే అలా జరిగితే న్యూజిలాండ్, శ్రీలంకకి చెరొక పాయింట్ వస్తాయి. అప్పుడు కివీస్ కి టోటల్ గా 9 పాయింట్లు అవుతాయి. అనంతరం పాక్ గానీ ఇంగ్లండ్ మీద గెలిచి 10 పాయింట్లు సాధిస్తే ఎకాఎకీ సెమీస్ లో కూర్చుంటుంది.
నిజానికి వరల్డ్ కప్ లో పాక్-ఇండియా తలపడితే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అంతకుమించి వరల్డ్ కప్లో ఇండియాతో 8 మ్యాచ్ లు ఆడితే అన్నింటా పాకిస్తాన్ ఓడిపోయింది. అందువల్ల కొన్ని పాజిటివ్ సంకేతాలున్నా.. భారతీయులు అంత ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే అవతల ఎంతటి శక్తివంతుడితోనైనా పోరాడవచ్చు, ఎంతటి మేధావితోనైనా తలపడొచ్చు. కానీ అదృష్టవంతుడితో మాత్రం పోరాడలేం.
ఎందుకంటే వర్షం వచ్చి అడ్డం పడితే, పాకిస్తాన్ అదృష్టవశాత్తూ సెమీస్ కి చేరినట్టవుతుంది. ఆల్రడీ కివీస్ తో అలాగే గెలిచింది. అంతేకాదు 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ కొట్టిన ఘటనని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఇంగ్లండ్ తోనే ఆఖరి లీగ్ మ్యాచ్ లో తలపడింది. కానీ 74 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది. ఆ టైమ్ లో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. చెరొక పాయింట్ ఇచ్చారు. దాంతో ఇప్పటిలాగే 8 పాయింట్లే పాక్ ఖాతాలో ఉన్నాయి. ఒక్క పాయింట్ తో 9 అయి, సెమీస్ లో అడుగు పెట్టింది. కప్ కొట్టుకొచ్చింది.
అందుకే పాకిస్తాన్ కి వర్షం మేలు చేసిందంటే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా శ్రీలంక-కివీస్ మ్యాచ్ లో వర్షం భయం ఉండటంతో అంతా కంగారుపడ్డారు. ఎలాగైతేనేం ఎట్టకేలకు 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి, పాకిస్తాన్ దారులు దాదాపు మూసేసిందనే చెప్పాలి.
కాకపోతే ఏదైనా జరగొచ్చు. మాక్స్ వెల్ 201 పరుగులు చేసి ఓడిపోతున్న మ్యాచ్ ని గెలిపించలేదా.. పాకిస్తాన్ కూడా కివీస్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం వస్తుందని తెలిసి టీ 20 తరహాలో ఆడి 25 ఓవర్లలో 200 పరుగులు చేసి, డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో గెలవలేదా.. ఇండియా-ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియా గెలవలేదా? ఎన్నో అద్భుతాలు జరిగాయి.
అందువల్ల పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే వరకు దేనినీ తేలిగ్గా తీసుకోలేమని క్రీడా పండితులు చెబుతున్నారు.