అంతా బాగానే ఉంది…మళ్లీ ఇదేం ట్విస్ట్ అని నెట్టింట గగ్గోలు మొదలైంది. బీసీసీఐ సెక్రటరీ జైషా టీమ్ ఇండియా క్రికెటర్లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఒక బాంబ్ కూడా పేల్చారు. 2024 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
అంతేకాదు రోహిత్ కి కెప్టెన్సీ అప్పగించడంపై గ్యారంటీ ఇవ్వలేమని తెగేసి చెప్పేశాడు. దానికి ముందు ఐపీఎల్ ఉంది, ఆఫ్గనిస్తాన్ టూర్ ఉంది, అందులో పెర్ ఫార్మెన్స్ బట్టి ఉండవచ్చునని నర్మగర్భంగా చెప్పాడు. దీంతో నెట్టింట భగ్గుమని కామెంట్లు వస్తున్నాయి. ఈసారి డైరక్టు జైషాపైకి బాణాలు ఎక్కుపెట్టేశారు.
‘అసలు నీకుందా గ్యారంటీ’…అని ఎదురుదాడి మొదలు పెట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, అడ్డంగా పదవులు సంపాదించడం కాదు, అంతర్జాతీయ మ్యాచ్ లో కష్టపడి ఆడాలి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నిరంతరం మోస్తూ ఉండాలి. అప్పుడు తెలుస్తుంది ఆటంటే ఏమిటోనని ఘాటుగానే విమర్శిస్తున్నారు. శ్రీలంక బోర్డుపై ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని ఐసీసీ సీరియస్ అయ్యింది. ఏకంగా నిషేధమే విధించింది. మరి బీసీసీఐలో జరిగేదేంటి? అని ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా జట్టుని నడిపించి ఫైనల్ వరకు తీసుకెళ్లిన రోహిత్ శర్మని కాదని, టీ 20 కెప్టెన్సీ మరొకరికిస్తే ఊరుకుంటామా? అని వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. టీమ్ ఇండియా అభిమానుల మనోభావాలతో ఆటలాడవద్దు అని కూడా అంటున్నారు. మీరు నిష్ఫాక్షికంగా ఎంపిక చేయండి. రోహిత్ శర్మ నిజంగా ఆడనంటే, వదిలేయండి అని చెబుతున్నారు.
హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడని జైషా అన్నాడు. బహుశా మూడు నెలల్లో సెట్ అవుతాడని చెబుతున్నారు. ఎన్సీఏ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. తర్వాత మహ్మద్ షమీ సైతం త్వరగానే కోలుకుంటాడని అన్నారు. అతను కూడా త్వరలోనే ఎన్సీఏ లో చేరతాడని, సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళతాడని తెలిపాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
హెడ్ కోచ్ గా ఉండమని బీసీసీఐ ఒప్పించినట్లు తెలిపాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత, తన విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నాడు. అయితే తను రెండేళ్లు కొనసాగాలని, కోరుకుంటున్నట్టు తెలిపాడు. చివరగా రోహిత్ శర్మ విషయానికి వస్తే, టీ 20 కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మకి అప్పుడే గ్యారంటీ ఇవ్వలేమని తేల్చి చెప్పాడు.
బోర్డు సమీక్షా సమావేశంలో టీ 20 వరల్డ్ కప్ కెప్టెన్సీపై తనకి క్లారిటీ కావాలని రోహిత్ అడిగినట్టు, అతన్నే కొనసాగించడానికి అంతా ఓకే చెప్పినట్టు, ఒక బోర్డు సభ్యుడు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలీదు. లేదంటే అందరూ ఒప్పుకున్నా, జైషాకి ఇష్టం లేదా? అనేది తెలీడం లేదని అంటున్నారు. ఎందుకో జైషాకి రోహిత్ కన్నా, హార్దిక్ పైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. హార్దిక్ ఏమైనా రెడీ అయితే, రోహిత్ శర్మ కెప్టెన్సీ కథ ముగిసినట్టేనా? అనే ప్రశ్నలు నెట్టింట అప్పుడే వినిపిస్తున్నాయి.
లేదంటే ఐపీఎల్ రోహిత్ శర్మ పెర్ ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఏడాదిగా పొట్టి క్రికెట్ కి కొహ్లీ, రోహిత్ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అదీ అసలు సంగతని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.