Shami Vs Shardul : అంతా బాగానే ఉంది కానీ.. బీసీసీఐపై ఎప్పటి నుంచో భయంకరమైన ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆటగాళ్ల ఎంపిక దగ్గర నుంచి వారిని జట్టులోకి తీసుకునేవరకు, తర్వాత ఫైనల్ లిస్టులో పెట్టేవరకు, చివరికి గ్రౌండ్ లోకి పంపించేవరకు ఏవో గిమ్మిక్కులు చేస్తూనే ఉంటారు. 130 కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆటలాడుతూనే ఉంటారని విమర్శిస్తున్నారు.
ఇప్పటికే రకరకాల టోర్నమెంట్ల పేర్లు చెప్పి ఎందరో ప్లేయర్లను తీసుకుంటున్నారు. టీ 20 కి ఒక జట్టు, వన్డేకి ఒక జట్టు, టెస్ట్ కి ఒకజట్టు ఇలా ఎంపిక చేస్తున్నారు. అందరికీ న్యాయం చేస్తున్నారు. కానీ కీలకమైన వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో మాత్రం ఇలా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని అంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే శార్ధూల్ ఠాగూర్ ని ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై టీమ్ మేనేజ్మెంట్ కి ఎందుకంత అభిమానమో అర్థం కావడం లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
వన్డేల్లో అతని కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. 46 వన్డేల్లో 30.54 శాతంతో 64 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ లో రెండు మ్యాచ్ ల్లో 8 ఓవర్లు మాత్రమే శార్దూల్ వేశాడు. అప్పటికి 43 పరుగులిచ్చి ఒక వికెట్టు మాత్రమే తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మకి అతనిపై నమ్మకం ఉందో లేదో తెలీదు. కానీ తనకి పూర్తి కోటా ఇవ్వకుండా హార్దిక్ తో ఎక్కువ వేయిస్తూ ఉంటాడు. అతను ఆల్ రౌండర్ కాబట్టి తీసుకున్నామని బీసీసీఐ చెబుతోంది. అంటే ఆఖరి బ్యాట్స్ మెన్ కి కూడా బ్యాటింగ్ వచ్చి ఉండాలనేది కాన్సెప్ట్ అని చెబుతున్నారు.
అందుకే షమ్మీలాంటి చక్కని పేసర్ ని పక్కనపెట్టి శార్దూల్ కి అవకాశం ఇచ్చారని అంటున్నారు. కానీ మేనేజ్మెమెంట్ ఆశించినట్టు అతను బ్యాట్స్ మేన్ కాదు…బౌలర్ అని చెబుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మని ఒత్తిడిలోకి నెట్టి అతన్ని తీసుకుంటున్నారా? అనే సందేహాలు ఉన్నాయి. శార్దూల్ కి బాల్ ఇస్తే ధారాళంగా పరుగులు ఇస్తాడని రోహిత్ భయపడుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఓపెనర్ల దగ్గర నుంచి 10వ స్థానం వరకు ఇండియా జట్టు ఫిట్ గా ఉంది. ఇంతమంది అవుట్ అయిపోయాక ఆ పదో బ్యాట్స్ మేన్ వచ్చి పొడిచేదేముంది…ముందు షమ్మీని తీసుకోండి బాబూ…కెప్టెన్ పై ఒత్తిడి తగ్గించండి…అని నెటిజన్లు కొందరు సీరియస్ అవుతున్నారు.
ఒకొక్కసారి ప్రత్యర్థి జోడీలను విడదీయడం ఎవరి వల్లా కాదు.అలాంటప్పుడు అమ్ములపొదిలా షమ్మీలాంటి వాళ్లుంటే కెప్టెన్ కి మైదానంలో ప్రయోగాలు చేయడానికి వీలవుతుందని అంటున్నారు. అంతేకాదు బూమ్రాపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
ఇప్పటికయ్యేందేదో అయ్యింది…ఇక నుంచైనా షమ్మీని ఆడించమని నెట్టింట డిమాండ్లు అధికమవుతున్నాయి. 2019 వరల్డ్ కప్ ని అప్పుడే మరిచిపోయారా? అని కూడా సీరియస్ అవుతున్నారు. కేవలం ఆనాడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్వాకం వల్లే సెమీస్ లో ఓటమి పాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో గుర్తులేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నుంచి అటు ఐపీఎల్ లోనూ, ఇటు ఇండియన్ క్రికెట్ లో నూ అంబటి రాయుడు బ్రహ్మండంగా ఆడుతుంటే అతన్ని తప్పించి, రిషబ్ పంత్ ని విమానం ఎక్కించి మరీ తీసుకెళ్లారు. అదెంత పెద్ద పొరపాటు నిర్ణయమో సెమీస్ లో అతను అవుట్ అయిన తీరే చెప్పిందని అంటున్నారు.
అసలెందుకు రాయుడిని సెలక్ట్ చేయలేదో…ఒక్క సెలక్టర్ కూడా చెప్పలేదు. ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుతో సెలక్టర్లు తీసుకునే నిర్ణయాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఎన్నో ఉదాహరణలున్నాయని చెబుతున్నారు. అయితే వారికి ఉండే ఒత్తిళ్లు వారికి ఉంటాయని కొందరు నర్మగర్భంగా వ్యాక్యానిస్తున్నారు. అంతకు మించి బోర్డులో ప్రాంతీయాభిమానం నిజమైన క్రీడాకారులకి పెనుశాపంగా మారిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అందుకని ఇప్పటికైనా శార్దూల్ ను తప్పించి, షమ్మీని తీసుకుని నిజమైన ఆట ఆడించమని పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.