Murder Case on Bangla Cricketer Shakib Al Hasan: బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు ఆగినా.. ఆ సెగ చాలామందికి తగులుతూనే ఉంది. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కు గట్టిగానే తగిలింది. అదేమిటంటే అతనిపై హత్య కేసు నమోదైంది. అయితే తను మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీలో ఎంపీగా ఉన్నాడు. అందువల్ల రాజకీయంగా ఆయనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన షకీబ్ కి, అలాగే మరో ఎంపీగా ఉన్న ప్రముఖ బంగ్లా నటుడు ఫెర్దూస్ అహ్మద్ ఇద్దరిపై కూడా కేసులు పెట్టారని అంటున్నారు.
బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తండ్రి రఫీకుల్ ఇస్లామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ అల్ హసన్ 28వ నిందితుడిగా ఉన్నారు. బంగ్లాదేశీ నటుడు ఫెర్దూస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నారు.
Also Read: అమాంతం పెరిగిపోయిన వినేశ్ ఫోగట్ బ్రాండ్ విలువ.. పారిస్ లో ఓడినా పాపులారిటీ పైపైకి!
అల్లర్ల కారణంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వం రద్దయింది. దీంతో, వీరిద్దరూ కూడా పదవులు కోల్పోయారు. ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి. షకీబ్ అయితే బంగ్లాదేశ్ క్రికెట్ కి ఎంతో సేవలందించాడు.
ఎంపీగా ఉండి కూడా 2023 వన్డే ప్రపంచకప్ పోటీల్లో జట్టు తరఫున ఆటగాడిగా ఆడాడు. అయితే చివర్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో వివాదస్పద రీతిలో ఏంజెలో మాథ్యూస్ ను టైమ్ అవుట్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడిలా కేసులో ఇరుక్కున్నాడు.