IPL : ముంబై మళ్లీ గెలుపుబాట పట్టింది. రెండు వరుస పరాజయాల తర్వాత రోహిత్ సేన విజయం సాధించింది. రాజస్థాన్ తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. యశస్వి జైశ్వాల్ (124, 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సులు) సూపర్ సెంచరీతో 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతోనే 112 పరుగులు రాబట్టాడు. కానీ రాజస్థాన్ జట్టులో మరొక బ్యాటర్ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేదు. ఒకరిద్దరూ బ్యాటర్లు జైస్వాల్ తోడుగా బాగా ఆడుంటే రాజస్థాన్ స్కోర్ 250 దాటేది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు,మెరిడిత్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తొలి నుంచి ధాటిగానే ఆడింది. ఇషాన్ కిషన్ (28), గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55), తిలక్ వర్మ (29 నాటౌట్), టిమ్ డేవిడ్ (45 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగినా.. చివరిలో టిమ్ డేవిడ్ వీరవిహారం చేయడంతో ముంబై గెలిచింది.
రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు, బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు. అద్భుత సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.