Mumbai Indians : 140 కోట్ల మంది ప్రజలు…వారికి ఆగ్రహం వచ్చినా, ఆనందం వచ్చినా పట్టుకోలేం అనడానికి ముంబై ఇండియన్స్ పై పెరుగుతున్న వ్యతిరేకతే నిదర్శనం. కేవలం రోహిత్ శర్మని ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పించడమే అందుకు కారణం. దీంతో రోహిత్ అభిమానులే కాదు, క్రికెట్ ను ప్రేమించేవాళ్లు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా సామాజిక మాధ్యమాల నుంచి 8 లక్షల పైనే ఫాలోవర్స్ ముంబై ఇండియన్స్ ను వదిలేసి బయటకు వచ్చేశారు.
ముంబై ఇండియన్స్ కి ట్విటర్ లో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 8.2 మిలియన్లకి పడిపోయింది. దాదాపు 4 లక్షల మంది ముంబై ఇండియన్స్ ని వదిలేశారు. అలాగే ఇన్ స్టాలో కూడా ఫాలోవర్స్ సంఖ్య క్షణక్షణానికి తగ్గిపోతోంది.
ఓవరాల్ గా చూస్తే ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఐపీఎల్ జట్లలో ముంబై నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఇప్పుడది నెంబర్ టూకి పడిపోయింది. ఇక్కడ నుంచి కూడా 4 లక్షల మంది బయటకు వచ్చేశారు. ఇప్పుడా నెంబర్ వన్ స్థానాన్ని ధోనీ నాయకత్వంలో నడిచే చెన్నై సూపర్ కింగ్స్ ఆక్రమించింది. ఇంకొక ప్రమాదం ఏమిటంటే, ఒకవేళ రోహిత్ శర్మగానీ ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడకపోతే, దాని గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశాలున్నాయి.
అయితే చాలామంది అనేదేమిటంటే పోతే పోయిందిలే కెప్టెన్సీ గానీ, రోహిత్ శర్మని అభినందించే వారి సంఖ్య చూస్తుంటే ముచ్చటేస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లూ ప్రజలకి ముఖం చూపించలేక బాధపడిన రోహిత్ శర్మకు ఈ స్పందన చూసి వెయ్యేనుగుల బలం వస్తుందని అంటున్నారు. అంతేకాదు తన వెనుక ఇంతమంది ప్రజలు ఉన్నారని తెలిసిన తర్వాత ఏ క్రికెటర్ కైనా ఎంత ఆనందంగా ఉంటుందని అంటున్నారు.
ఇప్పుడీ నిర్ణయం ముంబై ఇండియన్స్ కాబట్టి ఇలా చూపిస్తున్నారు. అదే బీసీసీఐ చేస్తే మాత్రం మరో రేంజ్ లో ఉంటుంది, తోక కత్తిరించేస్తారు జాగ్రత్త అని పోస్ట్ లు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన తొలగించే విధానం దారుణమని కామెంట్లు రాస్తున్నారు. ఇది నిజంగా బీసీసీఐకి కత్తి మీద సాము అనే అంటున్నారు. ఏ మాత్రం అటూ ఇటూ నిర్ణయాలు తీసుకున్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా అంటున్నారు.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఏమైనా వెనక్కి తగ్గుతారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే అదంత ఈజీ కాదని అంటున్నారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గితే, తమకి విలువ ఎక్కడ ఉంటుదనేది ఒకటి, రెండోది ఇలా ప్రజలు చెప్పారని మార్పులు చేస్తే, జట్టుకి ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు.
కానీ అల్టిమేట్ గా ఎక్కడైనా ప్రజలే అల్టిమేట్. వారికి నచ్చిందే చేయాలి. వారికి నచ్చిన సినిమానే తీయాలి. వారికి నచ్చితేనే రాజకీయ పార్టీలైనా అందలం ఎక్కుతాయి.వారికి నచ్చితేనే క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి స్టేడియంకు వస్తారు.. మరిప్పుడు బీసీసీఐ ఏం చేస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.