Shreyas Iyer To Play In Ranji Trophy: దెబ్బకు దెయ్యం దిగొచ్చింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పోవడంతో శ్రేయాస్ అయ్యర్ తలకెక్కిన మత్తు దిగింది. వెంటనే ఆగమేఘాల మీద ముంబయి జట్టుకి ఆడతానని చెప్పడంతో జట్టులోకి తీసుకున్నారు. తమిళనాడుతో జరగనున్న సెమీస్లో శ్రేయాస్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఆజింక్య రహానే మాట్లాడుతూ.. శ్రేయాస్ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు జట్టులో కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపాడు.
ఇప్పుడు శ్రేయాస్ రంజీలు ఆడటం చర్చనీయాంశంగా మారింది. అప్పుడే ఆడి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని కొందరంటున్నారు. కానీ అటు ఇషాన్ కిషన్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా లేదు. బహుశా తను తెగేవరకు లాగేలా కనిపిస్తున్నాడు. ఆల్రడీ తెగిపోయింది. కానీ దానికి ముడి వేయడానికి శ్రేయాస్ చూస్తున్నాడు.
ఇషాన్ కిషన్ వాలకం చూస్తుంటే ఇండియన్ ఐపీఎల్ కూడా వదిలేసి ఏ అమెరికా జట్టులోకి వెళ్లిపోవాలని చూస్తున్నాడా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ బీసీసీఐ తప్పు కూడా లేదని అంటున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్కి ఇషాన్ కిషన్ అందుబాటులోకి రాలేదు. ఆ క్రమంలో ఇషాన్ని సంప్రదిస్తే, ఇంకా సిద్ధంగా లేనని చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత దుబాయ్ పార్టీల్లో కనిపించాడు. తర్వాత టీవీ షోల్లో కనిపించాడు. సరే రంజీల్లో ఆడమని చెబితే, ఐపీఎల్ కోసం ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. దీంతో బీసీసీఐకి వళ్లు మండింది.
Read More: బీసీసీఐ నిర్ణయాన్ని అభినందిస్తున్నా.. కపిల్ దేవ్..!
నిజానికి ఇంగ్లాంతో సిరీస్లో సరైన బ్యాటర్ కమ్ కీపర్ లేక టీమ్ ఇండియా చాలా అవస్థలు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుని ఆదుకోవాల్సిన ఇషాన్ పట్టించుకోకపోవడంతో వారికి మండిందని అంటున్నారు. అందుకే కేఎస్ భరత్ని తీసుకున్నారు. కానీ తను తేలిపోయాడు. రెండు టెస్టుల్లో ఆశించిన రీతిలో ఆడలేక పోయాడు.
అందుకే స్టాండ్ బై గా ధ్రువ్ జురెల్ను తీసుకున్నారు. తను నిరూపించుకున్నాడు. ఆడిన రెండో టెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ పరిస్థితి సంక్లిష్టంగా మారిపోయింది.