Mohammed Shami : వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ విభిన్నమైన బంతులను ప్రయోగించి వికెట్లు తీసిందని పాక్ మాజీ ఆటగాడు హాసన్ రాజా ఆరోపించాడు. దీనిపై భారత్ పేస్ సంచలనం మహ్మద్ షమీ స్పందించాడు. మీ వాదన చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. ఎవరో లోకల్ స్థాయి క్రికెట్ ఆడేవాళ్లు అంటే ఏదో తెలీక అన్నారులే అనుకోవచ్చు.. కానీ మీరు కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారే కదా… ఐసీసీ మెగా వరల్డ్ కప్ టోర్నమెంట్ అది, అందులో ఇలాంటివి జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించాడు.
వసీంభాయ్ కూడా మీకు వివరించాడు కదా.. అయినా మీరు మారలేదు. మారతారని నమ్మకం కూడా లేదని అన్నాడు. నేను మొదట నాలుగు మ్యాచ్ లు ఆడలేదు. అప్పుడు కూడా ఈ మాట విన్నానని అన్నాడు. కానీ నేను ఆడిన తొలిమ్యాచ్ లోనే 5 వికెట్లు తీశాను, తర్వాత 4 తీశాను, ఆ తర్వాత మళ్లీ 5 తీశాను. దీంతో కొందరు పాక్ ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారని అన్నాడు.
సరైన సమయంలో రాణించే ఆటగాళ్లే క్రికెట్ గొప్పవాళ్లని నేను నమ్ముతాను. మీకు బంతి వేరే రంగులో ఎందుకు కనిపిస్తుంది. అది బహుశా లైట్ వెలుగులో కావచ్చునని అన్నాడు. అయినా సరే, నువ్వు లోకల్ ప్లేయర్ వి కాదు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడావు, నువ్వే ఇలాగంటే, నిన్ను చూసే జనం నవ్వుకుంటారు, నాకేమీ కాదని అన్నాడు. మా టీమిండియా వెనుక 140 కోట్ల మంది ప్రజల మద్దతు ఉందని అన్నాడు. మీ వెనుక ఏం ఉందని అన్నాడు.
అయితే ఇంతకుముందు షమీ ఇన్ స్టాలో తన పేరు చెప్పకుండా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత డైరక్ట్ ఎటాక్ ఇచ్చాడు. ఇంకెప్పుడూ షమీ బౌలింగ్ లేదా టీమ్ ఇండియా బౌలింగ్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా సమాధానమిచ్చాడు. అంతేకాదు పాక్ మాజీ ఆటగాళ్ల ముఖాలపైకి తన మాటలనే బాల్స్ గా చేసి సంధించాడు. ఈపాటికి ముఖం పగిలిపోయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వరల్డ్ కప్ 2023లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్ టేకర్ గా మహ్మద్ షమీ నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.