Men’s T20 World Cup 2024 Schedule : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా టోర్నమెంటులో తొలిసారి 20 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 10 జట్లు కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టనున్నాయి.
ఇన్నాళ్లూ టైం వేస్ట్ గేమ్ అన్న అమెరికా, తామే ముందుకొచ్చి టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని చెప్పాలి.
మొత్తం నాలుగు గ్రూపులుగా జట్లను విభజించారు. ఒకొక్క గ్రూప్ లో ఐదేసి జట్లు ఉంటాయి.
‘ఎ గ్రూప్’ లో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి.
‘బి గ్రూప్’లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి.
‘ సి గ్రూప్’లో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్, ఉగండా, పపువా న్యూ గినియా ఉన్నాయి.
అన్నిటికన్నా గ్రూప్ -డి మాత్రం టఫ్ టీమ్ గా కనిపిస్తోంది. సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి. వీటిలో ఒక్క నేపాల్ తప్ప బంగ్లాదేశ్, నెదర్లాండ్ ఇరగదీసి ఆడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీనియర్ జట్లుగా ఉన్న సౌతాఫ్రికా, శ్రీలంక దేశాలకు కష్టాలు తప్పేలా లేవు.
ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. తర్వాత మళ్లీ వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒకొక్క గ్రూప్ లో నాలుగేసి జట్లుంటాయి. ఇందులోంచి మళ్లీ టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. చివరిగా ఇక్కడ గెలిచిన వారు ఫైనల్ మ్యాచ్ లో తలపడతారు.
ఓవరాల్ గా చూస్తే టీ 20 వరల్డ్ కప్ జూన్ 1 న ప్రారంభమై జూన్ 29న ముగుస్తుంది. ఈ మధ్యలో 20 దేశాల మధ్య 55 మ్యాచ్ లు జరగనున్నాయి.
గ్రూప్ ఏ నుంచి భారత జట్టు ఆడే మ్యాచ్ లు ఇలా ఉన్నాయి.
జూన్ 5న ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది.
జూన్ 9న న్యూయార్క్ వేదికగా అసలు, సిసలైన మ్యాచ్ పాకిస్థాన్తో జరగనుంది.
జూన్ 12న ఆతిథ్య జట్టు అమెరికాతో తలపడుతుంది.
జూన్ 15న కెనడాతో జరగనుంది.
అయితే భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే జరగనున్నాయి. న్యూయార్క్లో మూడు మ్యాచ్ లు జరగనుండగా.. కెనడాతో మ్యాచ్కు మాత్రం ఫ్లోరిడా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇకపోతే వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది. తొలి సెమీస్ జూన్ 26న గయానా (వెస్టిండీస్) వేదికగా జరగనుంది. రెండో సెమీస్ జూన్ 27న ట్రినిడాడ్ (వెస్టిండీస్)లో జరగనుంది. జూన్ 29న బార్బడోస్ ( వెస్టిండీస్) వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు కూడా వెస్టిండీస్ లోనే జరగడం విశేషం.
2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది.
2009లో జరిగిన రెండో టీ20 వరల్డ్ కప్ను పాకిస్థాన్ గెలిచింది.
2021లో టీ20 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకోగా.. 2022 టీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ సాధించింది. 2024లో మరి భారత్ గెలుస్తుందా? లేదా?అనేది వేచి చూడాల్సిందే.