Saurabh Kumar : ఎన్నో ఏళ్లుగా ఆ ఒక్క పిలుపు కోసం ఎదురుచూస్తున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. దశాబ్దకాలంగా క్రికెట్ ఆడుతూ దేశవాళి క్రికెట్ లో పేరు తెచ్చుకుని, ఇండియా ఏ జట్టులో కీలకంగా ఆడే సౌరభ్ కుమార్ కి ఎట్టకేలకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నంలో జరిగే రెండో టెస్ట్ కు ఉత్తర ప్రదేశ్ కు చెందిన సౌరభ్ ఎంపికయ్యాడు.
ఆల్రడీ జట్టులో మరో ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అంతేకాదు తనకన్నా సీనియర్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. మరి వీరిని దాటి విశాఖపట్నంలో అరంగేట్రం చేస్తాడా? అనేది కష్టమేనని అంటున్నారు.
మొదటి టెస్ట్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కు తోడుగా అక్షర్ పటేల్ ప్రభావం చూపలేకపోయాడు. ఎంతసేపు వాళ్లిద్దరిపైనే రోహిత్ శర్మ ఆధారపడ్డాడు. అశ్విన్, జడేజా జోడికి తగినంత విశ్రాంతి దొరక్కపోవడంతో ప్రభావంతంగా బౌలింగ్ చేయలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఇప్పుడు అశ్విన్, అక్షర్ పటేల్ కి తోడుగా మరొకరు కావాలి.
అందుకే ఇండియా ఏ జట్టులో వికెట్లు తీస్తున్న సౌరభ్ కుమార్ ని పిలిపించారు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న అనధికార టెస్ట్ లో ఒక మ్యాచ్ లో 4, ఒక మ్యాచ్ లో 5 వికెట్లు తీసి మంచి ఫామ్ లో సౌరభ్ కుమార్ ఉన్నాడు. అంతేకాదు బ్యాటింగ్ లో కూడా రాణించి 77 పరుగులు చేశాడు. అందుకే టీమ్ ఇండియా సౌరభ్ ని పిలిచింది.
సౌరభ్ కుమార్ ఇప్పటివరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 290 వికెట్లు పడగొట్టాడు. బీసీసీఐ నుంచి పిలుపు రాగానే సౌరభ్ కుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. భారత జట్టుకు ఆడటం నా కల, అలా జరగాలంటే ఎన్నో కలిసి రావాలని అన్నాడు. అయితే 2022లో శ్రీలంక సిరీస్ కు జట్టులో ఉన్నా, ఆడే అవకాశం దక్కించుకోలేక పోయాడు. ఈ సారి తప్పకుండా విశాఖపట్నంలో ఆరంగ్రేటం చేస్తాననే ఆశతో ఉన్నాడు.