MATHEWS BROTHER : టైమ్డ్ అవుట్..వ్యవహారం ఇంటా బయటా మండిపోతోంది. ఇప్పుడు దీనికి ఆజ్యం పోసేలా ఏంజెలో మాథ్యూస్ బ్రదర్ ట్రెవిన్ ఒకడు తోడయ్యాడు. తను కూడా తగ్గేదేలే అన్నట్టు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడిది మళ్లీ కొత్త మంట పుట్టించింది.
ఎప్పటికైనా శ్రీలంక రాకపోతావా? నీ సంగతి తేల్చకపోతామా? నీకుందిలే.. అని గట్టిగా స్ట్రోక్ ఇచ్చాడు.
మా అన్నను అన్యాయంగా అవుట్ చేస్తావా? ఇక్కడికి వస్తావుగా.. అప్పుడు చెబుతాం.. అని డెక్కన్ హెరాల్డ్ వార్తా పత్రికతో మాట్లాడుతూ పవర్ ఫుల్ కామెంట్స్ చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంకా ఏమన్నాడంటే..
టైమ్డ్ అవుట్ నిర్ణయంతో మేం చాలా నిరుత్సాహానికి గురయ్యాం. జంటిల్మెన్ గేమ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ క్రీడాస్ఫూర్తితో ఆడలేదు. అంతేకాదు మా అన్నయ్య ఎంత బతిమాలాడు. చూస్తున్నా నాకు చాలా బాధేసింది. నాకే కాదు, శ్రీలంకలో అభిమానులకే కాదు, క్రికెట్ ని అభిమానించి, ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ సంఘటన చూసి బాధ పడ్డారు. అందుకే అంత వ్యతిరేకత వచ్చిందని అన్నాడు.
మా అన్నయ్య అంత బతిమాలినా షకీబ్ కనీసం మానవత్వంతో కూడా వ్యవహరించలేదన్నాడు. అదే నాకు కోపం తెప్పించిందని అన్నాడు. అందుకే షకీబ్ను శ్రీలంకలోకి స్వాగతించం. ఒకవేళ అతను అంతర్జాతీయ మ్యాచ్ లేదా లంక ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు వస్తే రాళ్ల దాడి తప్పదని హెచ్చరించాడు. నేనే కాదు శ్రీలంకలో క్రికెట్ అభిమానుల నుంచి అతను చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు.
అయితే ఇన్ని వార్నింగులు ఇస్తున్న మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ కూడా క్రికెటరే..తనకి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఎదగలేకపోయాడు.
అయితే మాథ్యూస్ తప్పిదాలు కూడా ఉన్నాయని కొందరు గుర్తు చేస్తున్నారు. క్రీజులోకి వెళ్లగానే అంపైర్ కి చెప్పి గార్డు తీసుకుని ఉంటే, ఈ గొడవే వచ్చేది కాదని అంటున్నారు. తను క్రీజులో రెండు నిమిషాలు వేస్ట్ చేశాడని చెబుతున్నారు. అప్పుడు హెల్మెట్ బెల్ట్ ఊడిపోయిందని గ్రహించి, సిగ్నల్ పంపేసరికి తంతు ముగిసిపోయిందని అంటున్నారు.