టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఆటలాడితే ఊరుకుంటాడా? అది ఐపీఎస్ అధికారైనా ఎవరైనా ఒకటే…తనపై నిందారోపణలు చేసిన అధికారిపై ధోనీ పరువు నష్టం కేసు వేశాడు. విచారించిన మద్రాస్ హైకోర్టు, ధోనీ ఎలాంటి పొరపాటు చేయలేదని తేల్చింది. అనుచితంగా మాట్లాడినందుకు ఆ అధికారికి 15రోజుల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పును సవాల్ చేసేందుకు 30 రోజులు గడువిచ్చింది.
విషయం ఏమిటంటే.. 2013 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆ జట్టుపై రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించింది. ఇక్కడ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి.. ఫిక్సింగ్, బెట్టింగ్తో సంబంధాలు ఉన్నాయంటూ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు.
దీనిపై మహేంద్ర సింగ్ ధోనీ 2014లో పరువు నష్టం కేసు వేశాడు. తాను అడిగే 17 ప్రశ్నలకు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ సమాధానాలు చెప్పాలని అన్నాడు. ఏ ఆధారంతో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడో, చెప్పాలని కుండ బద్దలు కొట్టాడు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ధోనీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయద్దంటూ హెచ్చరించింది.
ధోనీ లాంటి వ్యక్తి కి సంబంధించి వార్తలు ప్రచురించే ముందు నిర్ధారించుకోవాలని, ఆ మాత్రం ప్రాథమిక సూత్రాలు పాటించకపోతే ఎలా? అంటూ టీవీ ఛానెల్ ను తలంటేసింది. ధోనీ పిటిషన్పై టీవీ ఛానెల్, ఐపీఎస్ అధికారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని ధోనీ, ఇది కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని కోరాడు.
దీంతో మరోసారి మద్రాస్ హైకోర్టు విచారించింది. ఐపీఎస్ అధికారి సంపత్కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే 30రోజులు గడువు ఇచ్చింది. తనకి అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవచ్చునని తెలిపింది.