Kulwant Khejroliya takes 4 wickets in 4 Balls in Ranji Trophy 2024: ఎవరైనా హ్యాట్రిక్ వికెట్లు తీస్తే ఎగిరి గంతేస్తారు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగానే, మూడో బంతిని అత్యద్భుతంగా వేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా తగిలితే హ్యాట్రిక్ తీసి చరిత్రలో మిగిలిపోవాలని అనుకుంటారు. ప్రతీ క్రికెటర్ కూడా తన కెరీర్ లో ఒక్కసారైనా హ్యాట్రిక్ తీయాలని కలలు కంటాడు.
అలాంటిది ఒకేసారి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే ఎలా ఉంటుంది? భారత యువ పేసర్ కుల్వంత్ కెజ్రోలియా రంజీ ట్రోఫీలో చేసిన అద్భుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ నాలుగు వికెట్ల రికార్డ్ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకోగా. .ఇప్పుడది వైరల్గా మారింది.
రంజీ ట్రోఫీ చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన మూడో బౌలర్గా కుల్వంత్ చరిత్రకెక్కాడు. మధ్యప్రదేశ్ తరఫున రంజీ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్గా కూడా నిలిచాడు.
మధ్యప్రదేశ్-బరోడా మధ్య జరిగిన రంజీ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 454 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బరోడా 132 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఫాలో ఆన్ కు వెళ్లింది. అప్పుడు రెండో ఇన్నింగ్స్లో కుల్వంత్ దెబ్బకు 270 పరుగులకే కుప్పకూలింది.
ఈ నాలుగు వికెట్లతో పాటు మరొక వికెట్ కూడా కుల్వంత్ తీసి
5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్, 34 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది.
అయితే కుల్వంత్ వేసిన ఒక ఓవర్ లో నాలుగు వికెట్లు ఎలా పడ్డాయంటే, రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా షెష్వాత్ రావత్, మహేష్, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్లను వరుసగా టపటపా పడిపోయాయి. ఇందులో రెండు బౌల్డ్ లు, ఒక స్లిప్ క్యాచ్, ఒక ఎల్బీ డబ్ల్యూ ఉంది.
ఈ నాలుగు వికెట్ల ఫీట్ ను 1988లో శంకర్ సైనీ తొలిసారి సాధించాడు. 2018లో మహమ్మద్ ముదాసర్ ఈ ఘనతను అందుకున్నాడు. తాజాగా కుల్వంత్ కెజ్రోలియా ఈ జాబితాలో చేరాడు. రంజీల్లో వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
హ్యాట్రిక్ పరంగా మధ్యప్రదేశ్ జట్టులో చూస్తే 1962లో హీరాలాల్ గైక్వాడ్ తొలిసారి సాధించాడు. 2019 లో రవి యాదవ్ ఈ ఘనత సాధించాడు. 2024లో తాజాగా కుల్వంత్ హ్యాట్రిక్ తీసి ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచాడు. మొత్తానికి బీసీసీఐ కంట్లో పడ్డాడు. భవిష్యత్తులో భారత సీనియర్ల జట్టుకి ఆడతాడని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.