IPL : వరుసగా 4 మ్యాచ్ ల్లో ఓడిన కోల్ కతా ఎట్టకేలకు గెలిచింది. బెంగళూరుకు షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (56), నారాయణ్ జగదీశన్ (27) తొలి వికెట్ కు 83 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ (31), కెప్టెన్ నితీశ్ రాణా (48) చెలరేగడంతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. చివరిలో రింకూ సింగ్ (18 నాటౌట్), డేవిడ్ వైజ్ (12 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో నైట్ రైడర్స్ స్కోర్ 200కు చేరుకుంది. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయ్ కుమార్ వైశాక్ రెండేసి వికెట్లు, సిరాజ్ ఒక వికట్ తీశారు.
201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు దూకుడుగానే ఇన్నింగ్స్ ను ఆరంభించింది. కానీ పవర్ ప్లే ముగిసే లోపు 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఆ తర్వాత కోహ్లీ (54), మహిపాల్ లామ్రోర్ (34) విజయం కోసం ప్రయత్నించారు. అయితే 2 పరుగుల తేడాతో ఈ ఇద్దరూ అవుట్ కావడంతో బెంగళూరు పరాజయం ఖాయమైపోయింది. దినేష్ కార్తీక్ (22) కాసేపు మెరుపులు మెరిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చివరికి బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్ కతా 21 పరుగుల తేడాతో గెలిచింది.
కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, ఆండ్రీ రస్సెల్, సుయాంశ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.