IPL : తొలి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ రెండో మ్యాచ్ లో బెంగళూరును చిత్తు చేసింది. 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఒకదశలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ శార్దుల్ ఠాకూర్ మెరుపులతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ (68, 29 బంతుల్లో 9×4, 3×6) చెలరేగాడు. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (57, 44 బంతుల్లో 6×4, 3×6), రింకూ సింగ్ (46, 33 బంతుల్లో 2×4, 3×6) కీలక ఇన్నింగ్స్ లు ఆడటంతో కోల్ కతా స్కోర్ 200 దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ (2/16), కర్ణ్ శర్మ (2/26) మెరుగ్గా బౌలింగ్ చేశారు. మిగతా బౌలర్లు విఫలం కావడంతో కోల్ కతా భారీ స్కోర్ సాధించింది.
భారీ లక్ష్యాన్ని మెరుగ్గా ఆరంభించిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్ కతా స్పిన్నర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఒకదశలో 4 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 42/0. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (4/15), సుయాశ్ శర్మ (3/30), నరైన్ (2/16) మాయాజాలానికి బెంగళూరు 17.4 ఓవర్లలో 123కే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (23) టాప్స్కోరర్ గా నిలిచాడు. మొదట కోహ్లి (21)ను నరైన్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత గూగ్లీలతో వరుణ్ రెచ్చిపోయాడు. తన తొలి ఓవర్లో డుప్లెసిస్ను బౌల్డ్ చేసిన వరుణ్.. తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్వెల్ (5), హర్షల్ పటేల్ (0)ను వెనక్కి పంపాడు. దీంతో ఆర్సీబీ 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. బ్యాటింగ్లో అదరగొట్టిన శార్దూల్.. తన తొలి ఓవర్లోనే బ్రాస్వెల్ (19)ను ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు ఓటమి లాంఛనమే అయ్యింది.
సిరాజ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అనుజ్ రావత్ (1)ను వెంకటేశ్ అయ్యర్ బదులు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన స్పిన్నర్ సుయాశ్ ఔట్ చేయడం ఆసక్తిని రేపింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్ లోనే 19 ఏళ్ల సుయాశ్ లెగ్కట్టర్, గూగ్లీలతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ అదరగొట్టి బౌలింగ్ లో ఒక వికెట్ తీసిన శార్దుల్ ఠాకూర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.