Kohli Vs Gambhir(Latest IPL Updates) : విరాట్ కోహ్లి ఆటలో ఎంత దూకుడు ఉంటుందో.. చేష్టలు అలాగే ఉంటాయి. ప్రత్యర్థి వికెట్ పడిన సందర్భంలో విరాట్ విన్యాసాలు ఒక్కొక్కసారి హద్దులు దాటుతూ ఉంటాయి. ప్రత్యర్థి బ్యాటర్లను తన మాటలతో కవ్విస్తుంటాడు. బ్యాటింగ్ చేసే సమయంలోనూ కోహ్లి అదే తీరు. ఆ దూకుడే అతడిని గొప్ప ఆటగాడిగా మార్చింది. అదే సమయంలో ఈ దూకుడు ఒక్కొక్కసారి హద్దులు దాటడం అతనికి చెడ్డపేరు తెస్తోంది.
గౌతమ్ గంభీర్ .. భారత్ జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన గొప్ప ఆటగాడు. గంభీర్ కూడా ఎప్పుడూ మైదానంలో దూకుడుగానే ఉండేవాడు. ప్రత్యర్థి ఆటగాళ్లుతో తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తించేవాడు. ప్రస్తుతం గౌతం గంభీర్ లక్నో జట్టుకు మెంటార్ కు ఉన్నాడు. అయినా సరే అదే దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
తాజాగా విరాట్ కోహ్లికి గంభీర్ తో గొడవ జరగడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ గొడవపడ్డారు. పరస్పరం గట్టిగా వాగ్వాదం చేసుకున్నారు. అయితే వారిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. వారితోపాటు ఈ గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్-ఉల్-హక్కు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు. కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించారు. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వహకులు ప్రకటించారు.
షేక్ హ్యండ్ ఇచ్చే సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీన్ హుల్ హక్ మధ్య వాదన జరిగింది. ఆ తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మేయర్స్ తో కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ వచ్చి మేయర్స్ ను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగింది. పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.
2013 ఐపీఎల్ లోనూ కోహ్లి గంభీర్ మధ్య గొడవ జరిగింది. అప్పుడు గంభీర్ కోల్ కతా జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పుడు తాజాగా మరో వివాదం రేగడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇద్దరూ తగ్గాలని కోరుతున్నారు. ఇలా ఏదో ఒక సందర్భంలో గొడవపడుతున్న గౌతం గంభీర్, విరాట్ ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్లే.