Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో ఘనత అందుకున్నాడు. T20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత స్టార్ బ్యాటర్.. అక్టోబర్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. అవార్డు రేసులో సౌతాఫ్రికా ప్లేయర్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా ఉన్నా… వాళ్లని వెనక్కి నెట్టి కోహ్లీ ఈ అవార్డు సాధించాడు. ఓ ఆటగాడి నెలవారీ ప్రదర్శనకు ICC ఇచ్చే ఈ అవార్డ్… కోహ్లీకి రావడం ఇదే తొలిసారి. పాకిస్తాన్, నెదర్లాండ్స్తో మ్యాచ్లలో అద్భుత హాఫ్ సెంచరీలతో మెరిసిన కోహ్లీ… అక్టోబరు నెల ముగిసే సరికి 205 పరుగులతో నిలిచాడు. పాకిస్తాన్పై 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించిన కోహ్లీ… నెదర్లాండ్స్ పై 62 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అక్టోబర్ నెలకు గానూ ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు తనకు రావడం ఆనందంగా ఉందన్న కోహ్లీ… తనకు ఓటేసిన క్రికెట్ అభిమానులు, ప్యానెల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. అందరి మద్దతూ తనకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
మరోవైపు… మహిళా క్రికెటర్లలో పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ నిదా దర్ అక్టోబర్లో ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. ఆమెతో భారత ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీపడ్డారు. ఆయితే ఆసియా కప్ టోర్నీలో నిలకడగా రాణించిన నిదా దార్కే అవార్డు దక్కింది. అక్టోబర్లో జరిగిన మహిళల ఆసియా కప్ టోర్నీలో నిదా దర్ 145 పరుగులు చేయడంతో పాటు… 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.